టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ(Raviteja) హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. 'క్రాక్' సినిమా తరువాత మళ్లీ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయారాయన. ఈ మధ్యకాలంలో వచ్చిన 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' ఈ సినిమాలేవీ వర్కవుట్ కాలేదు. అయినప్పటికీ రవితేజ చేతిలో చాలా సినిమాలే ఉన్నాయి. ప్రస్తుతం ఆయన 'ధమాకా', 'టైగర్ నాగేశ్వరరావు', 'రావణాసుర' వంటి సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు.

 

ఇంతలో మరో సినిమా ఒప్పుకున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) ఇప్పుడు మెగాఫోన్ పట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు. దీనికి 'ఈగల్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకి హీరోయిన్ దొరకడం లేదట. అనుపమ పరమేశ్వరన్, కృతిశెట్టి, ప్రియా వారియర్, రీతూవర్మ.. అలానే మరో ఇద్దరు హీరోయిన్లను సంప్రదించారు. 

 

కానీ ఎవరూ ఫైనల్ కాలేదని తెలుస్తోంది. రోల్ నచ్చక కొంతమంది.. డేట్స్ సర్దుబాటు చేయలేక మరికొంతమంది సినిమాను అంగీకరించలేదు. సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తయింది. సినిమా మొదలుపెట్టడమే ఆలస్యం కానీ హీరోయిన్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కలుగుతోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా ఓ హాలీవుడ్ సినిమాకి ఫ్రీమేక్ అని టాక్. హాలీవుడ్ లో 'జాన్ విక్' సినిమాలు ఎంత పాపులరో తెలిసిందే. 

 

2014లో వచ్చిన 'జాన్ విక్' కథను అడాప్ట్ చేసుకొని రవితేజతో తీయాలనుకుంటున్నారు కార్తిక్ ఘట్టమనేని. 'జాన్ విక్' సినిమాలకు సంబంధించి రీమేక్ రైట్స్ అమ్మే ఛాన్స్ లేదు. కాబట్టి రవితేజ సినిమా ఫ్రీమేక్ అనే చెప్పుకోవాలి. తెలుగుకి తగ్గట్లు కథలో మార్పులు, చేర్పులు చేసి.. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించాలనేది దర్శకుడి ప్లాన్. దర్శకుడు రెడీ చేసుకున్న ఎడాప్షన్ స్టోరీ రవితేజకి నచ్చడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై సినిమాను నిర్మించనున్నారు. 

 

ఇక రవితేజ ఇతర ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. 'టైగర్ నాగేశ్వరావు' సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎక్కడా రాజీపడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో నిర్మిస్తున్నారు. వంశీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రవితేజ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. స్టువర్ట్‌పురం రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా 70 వ దశకం నాటి స్టువర్ట్‌పురం నేపధ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


ఈ సినిమా కోసం రవితేజ సరికొత్తగా మేకోవర్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా రవితేజ బాడీ లాంగ్వేజ్, డిక్షన్, గెటప్ పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. ఈ సినిమాలో రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా కనిపించబోతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. దీంతో పాటు మెగా154 సినిమాలో నటిస్తున్నారు రవితేజ. అలానే ఆయన నటించిన 'ధమాకా' సినిమా డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.