మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యువి క్రియేష‌న్స్ విక్ర‌మ్ రెడ్డితో కలిసి `వీ మెగా పిక్చ‌ర్స్` అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. తాజాగా వీరితో అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌ అధినేత అభిషేక్ అగ‌ర్వాల్ సైతం జతకట్టారు. ఈ ముగ్గురు కలిసి ఓ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించి  అనౌన్స్ మెంట్ ను ఓ వీడియో రూపంలో విడుదల చేశారు. ప్రీ లుక్ పోస్టర్ సైతం విడుదల చేశారు. ఈ పోస్టర్ ను చూసిన ప్రతి ఒక్కరు అఖిల్ హీరోగా చేయబోతున్నట్లు భావించారు. ‘ఏజెంట్’ ఫ్లాప్ అయినా, ఓ మంచి అవకాశం దొరికినట్లు భావించారు.


‘ది ఇండియా హౌస్’ హీరోగా నిఖిల్ సిద్దార్థ్   


కానీ, చివరకు ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో మేకర్స్ అక్కినేని అభిమానులకు షాక్ ఇచ్చారు. ‘ది ఇండియా హౌస్’ పేరుతో సినిమాను ప్రకటించారు. ఇందులో హీరోగా నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియోను రిలీజ్ చేశారు. ‘కార్తికేయ 2’తో పాన్ ఇండియా రేంజిలో సక్సెస్ అందుకోవడం, ఆ సినిమాను నిర్మించిన అభిషేక్ అగర్వాల్ తో నిఖిల్ కు మంచి పరిచయం ఉండటం కారణంగా ఆయనను ఈ సినిమాకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.


స్వాతంత్ర్య పోరాట యోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఈ మూవీని రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ ప్రకటించారు. ఈ ముగ్గురు దిగ్గజాలు కలిసి ఈ సినిమాను నిర్మించడంతో దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, సావర్కర్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ద్వారా రామ్ వంశీ కృష్ణ దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఇప్పటికే ఆయన స్ర్కీన్ రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ శివ అనే క్యారెక్టర్ పోషిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.     


వీర్ సావర్కర్ కథతో తెరకెక్కబోతున్న ‘ది ఇండియా హౌస్’


ప్రస్తుతం  ‘ది ఇండియా హౌస్’ సినిమా అనౌన్స్ మెంట్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇండియా హౌస్‌ అనేది వాస్తవానికి 1905 నుంచి 1910 మ‌ధ్య కాలంలో ఉత్త‌ర లండ‌న్‌లో హైగేట్‌లోని క్రోమ్‌వెల్ అవెన్యూలో ఉన్న విద్యార్థి వ‌స‌తి గృహం. న్యాయ‌వాది శ్యామ్‌ జీ కృష్ణ వ‌ర్మ ప్రోత్సాహంతో బ్రిట‌న్‌లోని భార‌తీయ విద్యార్థులలో జాతీయ‌వాద భావాలను కలిగించేందుకు ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ సంస్థ ద్వారా లండన్ లో చదివేందుకు వెళ్లిన భారతీయ యువకులకు ఉపకారవేతనాలు అందించారు. అంతేకాదు, ఈ భవనం  రాజ‌కీయ క్రియాశీల‌త‌కు కేంద్రంగా మారింది. ఈ కథను వీర్ సావర్కర్ కు జతచేస్తూ సినిమాను తెరకెక్కించనున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.  






తీవ్ర నిరాశలో అక్కినేని అభిమానులు


అటు ఈ కొత్త చిత్రం ప్రకటనతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని తప్ప మరెవరూ నటించరని చాలా మంది అక్కినేని అభిమానులు ఆశించారు. కానీ, మేకర్స్ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా నటించబోతున్నట్లు వెల్లడించారు. ఈ  ప్రకటనతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మరో వైపు మెగా ఫ్యాన్స్ కూడా చెర్రీ నిర్ణయంపై నిరాశతో ఉన్నారు. మెగా కాంపౌండ్‌లో అంత మంది హీరోలు ఉండగా.. నిఖిల్‌ను మాత్రమే ఎందుకు ఎంపిక చేసుకున్నారంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. అయితే, ఇప్పటికే నిఖిల్ పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు పొందిన నేపథ్యంలో.. అతడిని ఎంపిక చేసుకోవడమే సేఫ్ అని నిర్మాతలు భావించి ఉండవచ్చని తెలుస్తోంది. ఏది ఏదైనా.. ఇది యాపారం!!


Read Also: మామా అల్లుళ్ల పోజు అదిరింది ‘బ్రో’- పవన్, సాయి తేజ్ మూవీ నుంచి సాలిడ్ పోస్టర్ రిలీజ్!