టాలీవుడ్ యువ హీరో సాయి రోనక్ హీరోగా నటించిన సినిమా ‘రాజయోగం’. ఈ మూవీకు రామ్ గణపతి దర్శకత్వం వహించారు. శ్రీ నవబాలా క్రియేషన్స్, వైష్ణవి నటరాజ్ ప్రొడక్షన్స్ పతాకాలపై మణి లక్ష్మణ్ రావు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు.


కార్యక్రమంలో సినిమా దర్శకుడు రామ్ గణపతి మాట్లాడారు. ప్రేక్షకుల నుంచి తమ ‘రాజయోగం’ సినిమాకు మంచి స్పందన వస్తోందని తెలిపారు. ఆడియన్స్ థియేటర్లలో సినిమాను ఎంతో ఆసక్తితో చూస్తున్నారని చెప్పారు. దర్శకత్వపరంగా ఇది తన మొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయని అన్నారు. మూవీ చాలా బాగా వచ్చిందని, ఇప్పటివరకూ సినిమా చూడని ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వెంటనే వెళ్లి చూడాలని కోరారు రామ్. థియేటర్లలో సినిమాను పక్కాగా ఎంజాయ్ చేస్తారని అన్నారు. అంతే కాదు తమ సినిమాను చూసి నవ్వకుండా ఉండగలిగితే రూ.లక్ష బహుమతి అందిస్తామని ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇంతగా చెప్తున్నామంటే.. మా సినిమా మీద మాకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోగలరు అంటూ వ్యాఖ్యానించారు.  


అనంతరం సినిమా హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ ను చూసి తాము పడిన కష్టానికి సరైన ఫలితం దక్కిందన్నారు. అయితే తమ సినిమాకు థియేటర్లు ఎక్కువగా కేటాయించకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. మంచి సినిమాలకు కూడా థియేటర్లు దొరక్కపోతే ఎలా అని వాపోయారు. ప్రేక్షకులు సినిమా చూసే టైమ్ కు షో లేకపోతే ఎలా చూడగలరని ప్రశ్నించారు. తన లాంటి చిన్న హీరోలు, కొత్త దర్శకులు ఇండస్ట్రీకి చాలా మంది వస్తున్నారని, అలాంటి వారందర్నీ ప్రోత్సాహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘రాజయోగం’ లాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సపోర్ట్ చేయాలని, అప్పుడే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు మరెన్నో వస్తాయని అన్నారు. థియేటర్ల పరంగా చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని కోరారు. 


మూవీలో హీరోయిన్ గా నటించిన అంకిత సాహా మాట్లాడుతూ.. ‘రాజయోగం’ సినిమాకు మంచి స్పందన వస్తుందన్నారు. ఇది కచ్చితంగా ప్రేక్షకలు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా అని అన్నారు. చిన్న సినిమాలను ఓటీటీలో వచ్చాక చూడకుండా ఇలా మంచి టాక్ వచ్చిన సినిమాలను థియేటర్లో చూడండి, బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పారు. ఈ మూవీలో అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయని, ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ ను ఈ మూవీ అందిస్తుందని అన్నారు. 


అనంతరం నటులు షకలక శంకర్, తాగుబోతు రమేష్ లు మాట్లాడుతూ.. దర్శకుడు రామ్ గణపతి ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించారని అన్నారు. సినిమా మీద ఫ్యాషన్ తో విదేశాల్లో మంచి కెరీర్ ను వదులుకొని ఇండస్ట్రీకి వచ్చారని అన్నారు. ఇక సినిమాలో తమ పాత్రలు కూడా చాలా అలరిస్తాయని చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో గాలి వాటానికి ఎవరూ సూపర్ స్టార్స్ అయిపోరని, ఎంతో కష్టపడితేగానీ ఆ స్థాయికి చేరుకోలేరు అని వ్యాఖ్యానించారు షకలక శంకర్.



Read Also: ఆ సినిమాలకు పోటీగా ‘శాకుంతలం’ - రిలీజ్ డేట్ వచ్చేసింది