విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సినిమాల్లో బిజీగా ఉన్నా, తాజా రాజకీయాలపై తన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి మోడీపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తాజాగా నోట్ల రద్దు వ్యవహారంపై ప్రకాష్ రాజ్ మోడీని టార్గెట్ చేశారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ నోట్ల రద్దు విషయంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మోడీ తీరుపై మండిపడ్డారు. ఇంతకీ రాజన్ ఏమన్నారంటే?


రఘురామ్ రాజన్ మాటలను ప్రస్తావించిన ప్రకాష్ రాజ్


నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోడీ కొద్ది రోజుల క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు చేయాలి అనుకునే సమయంలో ఆర్బీఐతో ఎన్నో సంప్రదింపులు జరిపినట్లు చెప్పారు. చివరకు ఆర్బీఐ అంగీకారంతోనే నోట్లను రద్దు చేసినట్లు చెప్పారు. దేశ ప్రజల హితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రధాని వ్యాఖ్యలను రఘురామ్ రాజన్ పూర్తిగా తప్పుబట్టారు. నోట్ల రద్దు సమయంలో తాను ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నానని చెప్పారు. అప్పుడు నోట్ల రద్దు గురించి ఒక్క నిర్ణయం కూడా ఆర్బీఐ తీసుకోలేదని చెప్పారు. ప్రభుత్వం కూడా ఈ విషయంలో తమను సంప్రదించలేదని చెప్పారు. సరిగ్గా ఇదే పాయింట్ ను బేస్ చేసుకుని ప్రకాష్ రాజ్ ప్రధానిపై విమర్శలు చేశారు. నిజం ఎవరు చెప్తున్నారో తెలుసుకోవాలని ప్రజలకు సూచించారు.






అదంతా ఫేక్ అంటూ విమర్శలు


ప్రకాష్ రాజ్ పోస్టుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రఘురామ్ రాజన్ సెప్టెంబర్ 2013 నుంచి సెప్టెంబర్ 2016 వరకు ఆర్బీఐ గవర్నర్ గా ఉండగా, నోట్ల రద్దు నవంబర్ 8, 2016లో జరిగింది. రఘురామ్ రాజన్ కు, నోట్ల రద్దుకు సంబంధం లేదని కౌంటర్లు ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ బూటకపు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.










సందుదొరికినప్పుడల్లా మోడీపై విమర్శలు


ప్రధాని మోడీపై, బీజేపీ సర్కారుపై ప్రకాష్ రాజ్ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటారు. మోడీని, మోడీ ప్రభుత్వాన్ని వెనుకేసుకొచ్చిన వారిని కూడా ప్రకాష్ రాజ్ వదిలి పెట్టడు. తాజాగా కాశీలో ఏర్పాట్లపై తమిళ నటుడు విశాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించగా, ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారు. తాజాగా నోట్ల రద్దు అంశాన్ని లేవనెత్తారు. పలుమార్లు టీవీ చర్చల్లోనూ ప్రధానిపై ప్రకాష్ రాజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సందర్భాలున్నాయి.


పొన్నియిన్ సెల్వన్ లో ప్రకాష్ రాజ్ కీలకపాత్ర


ఇక ప్రకాష్ రాజ్ సినిమాల విషయానికి వస్తే.. ఆయన తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్-1‘లో కీ రోల్ పోషించారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రం అద్భుత విజయాన్ని అందుకుంది. తమిళ నాట ఏకంగా రూ. 200 కోట్లు వసూలు చేసింది. ఇతర సినిమా పరిశ్రమల్లోనూ సత్తా చాటింది. పొన్నియిన్ సెల్వన్ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని ముందుగానే మణిరత్నం చెప్పారు. సుమారు రూ. 500 కోట్లతో ఈ రెండు భాగాలను తెరకెక్కించారు. తొలిపార్ట్ అద్భుత విజయాన్ని అందుకోవడంతో మరో పార్ట్ పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో పార్ట్-2 కూడా విడుదల కాబోతుంది. సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలోనూ ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.


Read Also: అందం, అభినయమే కాదు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ నయనతార, 39వ వసంతంలోకి లేడీ సూపర్ స్టార్!