యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'బాహుబలి', 'సాహో' లాంటి సినిమాల తరువాత నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'. ఈ సినిమా మొదలై రెండేళ్లు కావొస్తున్నా.. ఇప్పటివరకు షూటింగ్ పూర్తి కాలేదు. సినిమా నుండి కూడా ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. దీంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేయడం మొదలెట్టారు. సినిమా అప్డేట్స్ కోసం దర్శకనిర్మాతల ట్యాగ్ చేస్తూ వందల పోస్ట్ లు చేశారు. ఫైనల్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ స్పందించక తప్పలేదు. సినిమా షూటింగ్ పూర్తయిందని.. త్వరలోనే బిగ్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నామంటూ అనౌన్స్ చేశారు. 

 

దానికి తగ్గట్లుగానే ఈరోజు సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. 2022 మకర సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ  సినిమాను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ హీరో ప్రభాస్ పోస్టర్ ను విడుదల చేశారు. చుట్టూ ఇటలీ బ్యాక్ గ్రౌండ్ లో స్టైలిష్ గా సూట్ కేస్ పట్టుకొని నడిచొస్తున్న ప్రభాస్ లుక్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కూడా అభిమానులను ఆకట్టుకుంటుంది. ఫైనల్ గా 'రాధేశ్యామ్' టీమ్ ప్రేక్షకులను భారీ సర్ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి.
  

 


 


అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందని ఎవరూ ఊహించలేదు. దసరా నాటికే సినిమా వచ్చేస్తుందని అనుకున్నారు. పైగా సంక్రాంతి రేసులో పవన్ కళ్యాణ్-రానా సినిమా, అలానే మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలు ఉండడంతో ప్రభాస్ సినిమా రాదనుకున్నారు. కానీ దర్శకనిర్మాతలు మాత్రం సంక్రాంతి పండగకే రావాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయానికి ఏపీలో వంద శాతం ఆక్యుపెన్సీ వచ్చి.. టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ వస్తే.. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం. లేదంటే మాత్రం కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. 

 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాను వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛేత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.