టాలీవుడ్ లో సంక్రాంతి, దసరా సీజన్లలో పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. పండగ సీజన్ కాబట్టి జనాలు కూడా కొత్త సినిమాలు చూడడానికి థియేటర్లకు క్యూ కడుతుంటారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలంతా కూడా తమ సినిమాలను పండగలకే రిలీజ్ చేయాలని చూస్తుంటారు. రాబోయే దసరాకు ఎన్ని సినిమాలు వస్తాయనే విషయంలో క్లారిటీ లేదు కానీ సంక్రాంతి సినిమాలపై మాత్రం స్పష్టత వస్తోంది.

 

గతేడాది సంక్రాంతికి మహేష్ బాబు, అల్లు అర్జున్ ల మధ్య పోటీ నడిచింది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు', అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగగా.. రెండూ భారీ విజయాలను అందుకున్నాయి. 'అల.. వైకుంఠపురములో' సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టింది. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ఇండస్ట్రీ హిట్ అనే అంశంపై ఇప్పటికీ ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉన్నారు. 

 

ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా పోటీ ఫిక్స్ అయిపోయింది. 2022లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ప్రభాస్ లు పోటీ పడబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నుండి పవన్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ భీమ్లా నాయక్ గా కనిపించబోతున్నారు. 

 

ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేయగా.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో పవన్ తో పాటు రానా లుక్ ను కూడా బాగానే ఎలివేట్ చేశారు. అయితే అతడి క్యారెక్టర్ పేరు ఏంటి..? షేడ్స్ ఎలా ఉంటాయనే విషయాన్ని ఇంకా బయటపెట్టలేదు. మలయాళంలో హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ త్రివిక్రమ్ అందిస్తున్నారు. 

 

ఇందులో నిత్యామీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. ఇక మహేష్ బాబు నటిస్తోన్న 'సర్కారు వారి పాట' సినిమా రిలీజ్ డేట్ ను చాలా రోజుల క్రితమే ప్రకటించారు. 'సర్కారు వారి పాట' ఫస్ట్ లుక్ అయితే రాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం పక్కా అయింది. ప్రస్తుతం నడుస్తున్న షూటింగ్ అప్డేట్స్ ను బట్టి చూస్తుంటే.. సంక్రాంతికి ఈ సినిమా రావడం పక్కా అని తెలుస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. 

 

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నాయి కాబట్టి వీటికి పోటీగా కొత్త సినిమాలను రిలీజ్ చేయరని అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ 'రాధేశ్యామ్' సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది. 2022 సంక్రాంతి జనవరి 14న సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ మంచి జోష్ తో ఉన్నారు. మరి ఈ మూడు సినిమాల్లో ఏది రికార్డులు సృష్టిస్తుందో చూడాలి!