మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాను తెలుగులో రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను పునః ప్రారంభించారు. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు. ఈ మేకింగ్ వీడియోలో పవన్ కళ్యాణ్‌తో పాటు రానా గెటప్‌లను రివీల్ చేశారు. పవన్ కళ్యాణ్‌ను వెండితెరపై భీమ్లా నాయక్‌గా చూడడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ డైలాగ్స్-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు రూ.23 కోట్ల భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. నిజానికి రీమేక్ సినిమాల డబ్బింగ్ రైట్స్‌కు ఇంత ధర పలకదు. అయితే ఈ సినిమా రీమేక్ అయినప్పటికీ.. స్క్రిప్ట్ ను చాలా వరకు మార్చినట్లు తెలుస్తోంది. పైగా భారీ ఫైట్లు జోడించడం, ఎమోషన్స్‌ను పెంచడం వంటి కారణాలతో ఈ రేటు పలికినట్లు సమాచారం. 


ఇప్పటివరకు తెలుగు సినిమాలు హిందీ డబ్బింగ్ రేట్లలో 'వినయ విధేయ రామ' సినిమా భారీ ధరకు అమ్ముడైంది. ఆ సినిమా కోసం అప్పట్లో దాదాపు రూ.21 కోట్లు వెచ్చించి హిందీ డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకున్నారు. ఇప్పుడు అంతకుమించి పవన్ సినిమాకి రేటు పలికింది. పైగా ఉత్తరాదిన రానాకి గుర్తింపు ఉండటం కూడా ఈ సినిమా బిజినెస్‌కి కలిసొస్తుంది. పవన్-రానా లాంటి హీరోలు కలిసి నటిస్తుండడంతో సినిమాకి రూ.23 కోట్లు రేటు పలికిందని తెలుస్తోంది. 


డబ్బింగ్ రైట్స్ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్ర నిర్మాతలు శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం కూడా భారీ రేటు కోట్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం రూ.44 కోట్ల వరకు కావాలని అడుగుతున్నారట. ఈ విషయంలో జీ సంస్థతో బేరాలు సైతం మొదలుపెట్టారని టాక్. ఈ రేటు గనుక ఫిక్స్ అయితే నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే రూ.67 కోట్లు రావడం ఖాయం. ఇక థియేట్రికల్ బిజినెస్ ఏ రేంజ్‌లో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2022 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కనిపించనుంది. రానాకి భార్య పాత్రలో ఐశ్వర్యారాజేష్‌ను ఎంపిక చేసుకున్నారు.