సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ ను నాల్గో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వచ్చిన వార్తలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి రంగంలోకి దిగింది. తనకు విడాకులు ఇవ్వకుండా మరో మహిళను ఎలా వివాహం చేసుకుంటావ్ అంటూ రచ్చ చేస్తోంది. అంతేకాదు.. నరేష్ కి చాలా మంది ఆడవాళ్లతో ఎఫైర్స్ ఉన్నాయని ఆరోపణలు చేసింది. మరోపక్క పవిత్రా లోకేష్ తన భార్య అంటూ సుచింద్రప్రసాద్ మీడియాలో క్లెయిమ్ చేస్తున్నారు. 

 

నరేష్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని.. తన భార్యతో సంబంధాలపై మీడియా, కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని సుచింద్రప్రసాద్ లోకల్ మీడియాతో మాట్లాడారట. నరేష్ తో పవిత్రా రిలేషన్ వివాదంగా మారిన నేపథ్యంలో ఆమె భర్త కన్నడ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు చెప్పారట. 16 ఏళ్ల క్రితం హిందూ వివాహచట్టం ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు సుచింద్రప్రసాద్ తెలిపారు. తామిద్దరం దంపతులమని రుజువు చేసే ఆధారాలు ఉన్నాయని చెప్పారట. 

 

త‌న పాస్‌పోర్టులో భార్య‌గా ప‌విత్ర‌, అలాగే ఆమె పాస్‌పోర్టులో భ‌ర్త‌గా త‌న పేరు న‌మోదైన‌ట్టు ఆయన చెప్పారు. ఆధార్‌కార్డులో కూడా భార్య‌ భ‌ర్త‌లుగా తమ పేర్లు న‌మోద‌య్యాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. తమ దాంప‌త్యానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని ఆయన చెబుతున్నారు. పవిత్రాపై ఇప్పటికీ తనకు గౌరవం ఉందని.. ఈ పరిణామాల వెనుక ఎవరో ఉన్నారంటూ ఆయన అనుమానిస్తున్నారు. పవిత్రను ఉద్దేశించి తాను ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర కామెంట్స్ చేయలేదని స్పష్టం చేశారు. 

 

తనతో పెళ్లి జరగలేదని.. కేవలం సహజీవనం చేశామని, ఆ తరువాత విడిపోయామని పవిత్ర ఎందుకు చెప్పారో అర్ధం కావడం లేదని అంటున్నారు సుచింద్రప్రసాద్. తాను సంప్రదాయవాదినని, సహజీవన విధానంపై న‌మ్మ‌కాలు లేవని ఆయన అన్నారు. పదహారేళ్లుగా పవిత్రాతో కలిసి జీవిస్తున్నట్లు కర్ణాటక ప్రజలందరికీ తెలుసని అన్నారు. ప్రస్తుతం పవిత్ర కలిసి ఉంటున్న నరేష్ ఎవరో, ఆయనతో ఉన్న సంబంధాల గురించి నిజంగానే తనకు తెలియదని సుచింద్రప్రసాద్ మీడియాతో వెల్లడించారట.