Indian Police Force Web Series: ఈమధ్యకాలంలో అమెజాన్ ప్రైమ్‌లో విడుదలవుతున్న సిరీస్‌లు చాలావరకు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అది ఏ భాష సిరీస్ అయినా కూడా విడుదలయిన అన్ని భాషల్లో సబ్‌స్క్రైబర్లను ఆకట్టుకొని హిట్ టాక్ సంపాదించుకుంది. ఇక తాజాగా మరో హిందీ ఒరిజినల్ వెబ్ సిరీస్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. అదే ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’. సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి, వివేక్ ఓబ్రాయ్.. ఈ సిరీస్‌లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. సిరీస్‌లోని ఈ ముగ్గురు క్యారెక్టర్ గ్లింప్స్‌తో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది ప్రైమ్. దీంతో పాటు సిరీస్ విడుదల తేదీని కూడా రివీల్ చేసింది.


రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్..
రోహిత్ శెట్టి తెరకెక్కించిన ఈ ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే సిరీస్.. తన కాప్ యూనివర్స్‌లోని మరో భాగంగా ప్రేక్షఖుల ముందుకు రానుంది. ఈ సిరీస్‌ను రోహిత్ శెట్టితో పాటు సుశ్వాంత్ ప్రకాశ్ కూడా డైరెక్ట్ చేశాడు. ఇందులో తారా శెట్టి పాత్రలో శిల్పా శెట్టి నటించింది. విక్రమ్ బాక్షి పాత్రలో వివేక్ ఓబ్రాయ్ నటించాడు. ఇక ఆఫీసర్ కబీర్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించాడు. ఇక ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ట్రైలర్‌ను బట్టి చూస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుంది. ఆ టెర్రరిస్టులను పట్టుకోవడానికి సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటారు. ఇక టెర్రరిస్టులకు, పోలీసులకు మధ్య జరిగే కథ కాబట్టి ఈ సిరీస్‌లో థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు యాక్షన్ కూడా ఉండబోతుందని అర్థమవుతోంది.


విలన్ ఎవరు..?
‘ఇండయన్ పోలీస్ ఫోర్స్’ సిరీస్ ట్రైలర్‌లో ఎక్కువగా సిద్ధార్థ్ మల్హోత్రా, శిల్పా శెట్టి మాత్రమే కనిపించారు. వివేక్ ఓబ్రాయ్ ఒకట్రెండు షాట్స్‌లో మాత్రమే కనిపించాడు. పైగా ఇందులో విలన్ ఎవరు అని ట్రైలర్‌లో రివీల్ అవ్వలేదు. ట్రైలర్ చివర్లోని షాట్‌లో విలన్‌ను చూపించినా.. అప్పుడు తన మొహానికి మాస్క్ వేసి ఉంది. ఇక వివేక్ ఓబ్రాయ్‌ను ఎక్కువగా చూపించకపోవడం, విలన్ ఎవరో రివీల్ చేయకపోవడంతో వివేక్ పాత్ర వెనుక ఏదో ట్విస్ట్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. తాజాగా విడుదలయిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ ట్రైలర్‌కు యాక్షన్ లవర్స్ దగ్గర నుండి మంచి మార్కులే పడుతున్నాయి. జనవరి 19న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానుంది.






చాలా ఏళ్ల తర్వాత.. 
శిల్పా శెట్టి.. ఇలాంటి డేరింగ్ అండ్ డ్యాషింగ్ పాత్రలను తన కెరీర్‌లో ఎన్నో చేసింది. కానీ చాలాకాలంగా వెండితెరకు దూరమయ్యింది. బుల్లితెరపై మాత్రం పలు షోలలో జడ్జిగా కనిపిస్తూ.. అలరించింది. ఒకట్రెండు సినిమాల్లో కూడా కనిపించింది. కానీ చాలాకాలం తర్వాత తమ ఫేవరెట్ హీరోయిన్‌ను మళ్లీ ఇలాంటి డ్యాషింగ్ పాత్రలో చూడడం బాగుందని శిల్పా శెట్టి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సిరీస్‌తో సిద్ధార్థ్ మల్హోత్రా ఓటీటీ డెబ్యూ ఇవ్వనున్నాడు. ఇప్పటివరకు కేవలం సినిమాల్లోనే బిజీగా ఉన్న సిద్ధార్థ్.. మొదటిసారి ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే ట్రైలర్‌లో కబీర్ అనే పాత్రలో సిద్ధార్థ్ సరిగ్గా సూట్ అయ్యాడని ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు.


Also Read: హాలీవుడ్ మూవీలో తెలుగమ్మాయి, 'మీన్ గర్ల్స్’తో సూపర్ సక్సెస్ కొట్టిన మహేశ్ 'బ్రహ్మోత్సం' చిన్నారి