ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ లకు సెన్సార్ లేకపోవడంతో ఫిల్మ్ మేకర్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హద్దులు దాటి మరీ అసభ్య కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బూతు మాటలు, అశ్లీల సన్నీవేశాలతో వెబ్ సిరీస్ లు నిండిపోతున్నాయి. కంటెంట్ ను యథావిధిగా ఓటీటీ సంస్థలు స్ట్రీమింగ్ కు ఉంచుతున్నాయి. అయితే, ఈ విపరీత ధోరణిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఓటీటీలకు కూడా సెన్సార్ షిప్ ఉండాల్సిందేననే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి చేరారు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్.


ఓటీటీకి సెన్సార్‌షిప్ ఉండాలి- సల్మాన్ ఖాన్


'క్లీన్ కంటెంట్' కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపైనా సెన్సార్‌షిప్ ఉండాలని తాను నమ్ముతున్నానని సల్మాన్ ఖాన్ తెలిపారు. ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో సల్మాన్ మాట్లాడుతూ “డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ లపైనా(OTT) సెన్సార్‌షిప్ ఉండాలని నేను నిజంగా అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్న అసభ్యత, నగ్నత్వం ఆపాలి. 15,  16 ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలు వాటన్నింటినీ చూడవచ్చు. మీ చిన్న కుమార్తె దీనిని చూస్తే మీరు ఇష్టపడతారా? OTTలోని కంటెంట్‌ని సెన్సార్ చేయాలని నేను భావిస్తున్నాను. కంటెంట్ ఎంత క్లీన్ గా ఉంటే అంత బాగుంటుంది. మంచి ప్రేక్షకాదరణ కూడా వస్తుందని నేను భావిస్తున్నాను” అన్నారు.


హద్దులు మీరి ప్రవర్తించకూడదు-సల్మాన్


స్క్రీన్‌పై ఎంత వరకు నటించాలో అంత వరకే నటించాలని సల్మాన్ తెలిపారు. "మీరు తెరపై ఏం చేస్తున్నారో ఓసారి ఆలోచించుకోండి. ముద్దులు, ఎక్స్ పోజింగ్ లాంటివి చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి.  మీరు మీ ఇంట్లోకి వెళ్లేటప్పుడు మీ వాచ్ మెన్ కూడా మీరు చేసే పనులను గమనిస్తారని తెలుసుకోండి. అందుకే, కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని నేను భావిస్తున్నాను. మీరు సరిహద్దును దాటాల్సిన అవసరం లేదు. మనం భారతదేశంలో నివసిస్తున్నామని గ్రహించండి. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ మంచి కంటెంట్‌పై పని చేయడం ప్రారంభించారు. అది శుభపరిణామం” అన్నారు. ‘‘ఓటీటీలో ఇలాంటివి చేసిన మొదటి కొద్దిమందిలో రామ్ గోపాల్ వర్మ ఒకరని భావిస్తున్నా. ఆ తర్వాత ప్రజలు దీన్ని చూడటం ప్రారంభించారు. నేను అలాంటి కంటెంట్‌ను నమ్మను’’ అని తెలిపారు. 


డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టిన పలువురు స్టార్ యాక్టర్స్


గత కొన్ని సంవత్సరాలుగా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రదర్శించబడిన వెబ్ సిరీస్ లు, సినిమాలతో పలువురు బాలీవుడ్ నటులు ప్రశంసలు అందుకున్నారు. సైఫ్ అలీ ఖాన్, సమంతా రూత్ ప్రభు, షాహిద్ కపూర్, మనోజ్ బాజ్‌పాయ్‌లతో సహా సినీ పరిశ్రమలోని కొదరు స్టార్స్ OTT ప్రపంచంలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి తర్వాత థియేటర్లలోకి ప్రేక్షకులు వెళ్లడం మానేసినప్పుడు చాలా మంది సినీ తారలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీలోనే విడుదల చేశారు.  ఆ తర్వాత చాలా మంది పెద్ద నటులు, సినిమాలు, షోలతో OTTలో అరంగేట్రం చేశారు. కానీ, సల్మాన్ ఇంకా డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టలేదు. ఆదిశగా ఆలోచిస్తున్నట్లు కూడా సల్మాన్ ఏనాడు చెప్పలేదు. పైగా కొంత మంది తనను డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టాల్సిందిగా కోరినట్లు చెప్పారు. అయినా, దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదన్నారు.   


Read Also: అతిగా ఆలోచించకండి - విజయ్‌తో డేటింగ్‌పై రష్మిక సెటైర్స్, మరి ఈ సాక్ష్యాల సంగతేంటో!