టాలీవుడ్ యంగ్ హీరోల్లో నవదీప్ ఒకరు. ఆయన నటించింది కొన్ని సినిమాల్లోనే అయినా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా వెబ్ సిరీస్ లు మాత్రం వరుసగా చేస్తున్నారు. నిజానికి సినిమాల కన్నా వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆయన తాజాగా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన రీసెంట్ నటించిన సిరీస్ ‘న్యూసెన్స్’. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకున్నాయి. ఇటీవలే విడుదల చేసిన మొదటి టీజర్ కు మంచి స్పందన వచ్చింది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు రెండో టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. 


టీజర్ విషయానికొస్తే.. మొదటి టీజర్ కంటే రెండో టీజర్ ను ఇంట్రస్టింగ్ గా కట్ చేశారు మేకర్స్. 2003లో మదనపల్లి అనే ఊరిలో జరిగిన కథను బేస్ చేసుకొని ఈ వెబ్ సీరిస్ ఉంటుందని ముందు నుంచీ మేకర్స్ హింట్ ఇస్తూనే వస్తున్నారు. అలాగే ఈ రెండో టీజర్ లో కూడా ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. మదనపల్లి చెక్ పోస్ట్ లో ఓ ఎన్కౌంటర్ జరినట్టు చూపించారు. ఈ ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు, జర్నలిస్ట్ లకు మధ్య జరిగే ఘర్షణలను చూపించారు. ఇందులో పొలిటికల్ యాంగిల్ కూడా గట్టిగానే కనబడుతుంది. ఇక టీజర్ లో డైలాగ్ లు కూడా అదిరిపోయాయి. వాటిల్లో నవదీప్ చెప్పే ‘‘మనం న్యూస్ రాస్తే రెండు వందలే, రాయకపోతేనే ఇలా 2 వేలు వస్తాయి. అందుకే మన పెన్నులో ఇంక్ ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు’’... అలాగే ‘‘ఎవరు మాట విన్నా వినకపోయినా న్యూస్ రాసే వాడిచేతిలోనే ఉంటుంది చరిత్ర’’ వంటి డైలాగ్ లు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా చూస్తే ఈ వెబ్ సిరీస్ మీడియా, పాలిటిక్స్ చుట్టూ తిరిగే ఓ కథలా అనిపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో బిందు మాధవి కూడా జర్నలిస్ట్ గా కనిపించనుంది. 



ఇక ఈ యంగ్ హీరో నవదీప్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జై’ సినిమాతో ఇండస్టీలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ‘గౌతమ్ ఎస్.ఎస్.సి’, ‘చందమామ’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు ఎక్కువగా తమిళ సినిమాలకు కూడా పని చేశారు నవదీప్. ‘ఆర్య 2’ తర్వాత నవదీప్ కు చెప్పుకోదగ్గ సినిమా ఏమీ పడలేదు. అయినా ఆయనకు సినిమా అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. హీరోగానే కాకుండా కథకు బలం ఉండే ఏ పాత్రలోనైనా నటించడానికి సిద్దంగా ఉంటారాయన. ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ ఎక్కువగా కనిపిస్తున్నారు నవదీప్. ఆయన పలు సూపర్ సక్సెస్ అయిన వెబ్ సిరీస్ లలోనూ నటించారు. 


తాజాగా ఈ ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు నవదీప్. ఇప్పుడు విడుదల చేసిన రెండో టీజర్ కూడా ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొంది. ఈ వెబ్ సిరీస్ కు శ్రీప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరి నిర్మిస్తోంది. గతంలో ఈ నిర్మాణ సంస్థ ఆహా తో కలసి ‘కుడి ఎడమైతే’ అనే వెబ్ సిరీస్ ను రూపొందించింది. తాజాగా ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ కోసం ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఆహా ఓటీటీ కలసి పనిచేస్తున్నాయి. త్వరలో ఆహా ఫ్లాట్ ఫార్మ్ పై ‘న్యూసెన్స్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.



Also Read కబ్జ రివ్యూ: ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది? ఎవరు ఎవరిని ‘కబ్జ’ చేశారు?