గత కొంత కాలంగా థియేటర్లలో విడుదలైన పలు చిత్రాలు రెండు, మూడు వారాల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలో చూడని ప్రేక్షకులు ఓటీటీల్లో కుటుంబంతో కలిసి చూస్తున్నారు. తాజాగా విడుదలైన పలు తెలుగు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. ఇంతకీ ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

   


'భాగ్ సాలే'- ఆగష్టు 7 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్


ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్  ఎం.ఎం. కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన సినిమా 'భాగ్ సాలే'. ప్రణీత్ సాయి దర్శకత్వంలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్, బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ సినిమా పతాకాలపై అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల ఈ చిత్రాన్ని నిర్మించారు.  జూలై 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.    ఫుల్ ఫన్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ ఆగష్టు 7 నుంచి నెట్‌ ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.


'హిడింబ'- త్వరలో ‘ఆహా’లో స్ట్రీమింగ్


'రాజు గారి గది' సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న హీరో అశ్విన్ బాబు హీరోగా నటించిన 'హిడింబ' గత నెల(జులై) 20న థియేటర్లలోకి వచ్చింది. అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అశ్విన్ బాబు సరసన నందిత శ్వేత హీరోయిన్ గా నటించింది. శ్రీ విగ్నేష్ కార్తీక్ సినిమాస్ బ్యానర్ పై శ్రీధర్ గంగపట్నం ఈ చిత్రాన్ని నిర్మించారు. వికాస్ బడిసా సంగీతమందించారు. ప్రమోదిని, రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచే, మకరంద్ దేశ్పాండే, శుభలేఖ సుధాకర్, ఛత్రపతి శేఖర్ కీలక పాత్రలు పోషించారు. మిస్టరీ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కాలేదనే చెప్పుకోవచ్చు.  ఈ మూవీ త్వరలోనే ‘ఆహా’లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. అయితే, కచ్చితంగా ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది అనే విషయాన్ని ‘ఆహా’ అఫీషియల్ గా ప్రకటించలేదు.


‘ఆదిపురుష్’- ఆమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్?


ఈ ఆగస్టులో ‘ఆదిపురుష్’ కూడా OTTలో ప్రసారం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన 8 వారాల తర్వాత OTTలో ప్రసారం అవుతుందని ప్రచారం జరిగింది. జూన్ 16న ఈ మూవీ రిలీజ్ అయ్యింది  కాబట్టి, OTT విడుదల ఆగస్టు రెండవ లేదా మూడవ వారంలో ఉంటుంది. ప్ర‌భాస్ రాముడిగా, కృతి స‌న‌న్ జానకిగా నటించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. త్రీడీ మోష‌న్ క్యాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. 


‘బేబీ’- ఆగస్టు 18 నుంచి ‘ఆహా’లో ప్రసారం!


చిన్న సినిమాగా విడుదలై పెద్ద హిట్ అందుకున్న చిత్రం ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించి ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర చక్కటి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ఆగస్టు 18 నుంచి ‘ఆహా’లో ప్రసారం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన రాలేదు.  అటు రీసెంట్ గా విడుదలైన ‘స్పై’, ‘రంగబలి’ సినిమాలు ఇప్పటి అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లి క్స్‌ లో ప్రసారం అవుతున్నాయి.


Read Also: సైమా అవార్డ్స్‌-2023 నామినేషన్స్ లిస్ట్ - 11 కేటగిరీల్లో ‘RRR’, 10 విభాగాల్లో ‘సీతారామం’ పోటీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial