Alia Bhatt as Executive Producer: ప్రస్తుతం హీరోహీరోయిన్లుగా సక్సెస్ సాధించిన చాలామంది.. ఆఫ్ స్క్రీన్ కూడా తమ లక్‌ను పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే చాలావరకు నటీనటులు తమ కెరీర్‌లో ఒక్కసారైనా నిర్మాతలుగా, దర్శకులుగా మారుతున్నారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి నేషనల్ అవార్డ్ విన్నర్ ఆలియా భట్ కూడా చేరింది. ఒక వెబ్ సిరీస్‌తో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సిరీస్ టీమ్ ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ విడుదల కానుండగా.. ఆలియా భట్‌ను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉందంటూ ప్రైమ్.. తమ సోషల్ మీడియాలో ప్రకటించింది.


అడవిలో కుట్ర..


అమెజాన్ ప్రైమ్.. బ్యాక్ టు బ్యాక్ వెబ్ సిరీస్‌లతో హిట్లు కొడుతోంది. ఇక త్వరలోనే ‘పోచర్’ అనే మరో వెబ్ సిరీస్‌ను లైన్‌లో పెట్టింది. రిచీ మెహ్తా తెరకెక్కించిన ఈ వెబ్ సిరీస్‌లో నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందూ భట్టాచార్య లీడ్ రోల్స్ చేస్తున్నారు. తాజాగా ‘పోచర్’ పోస్టర్‌ను తమ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది అమెజాన్ ప్రైమ్. ‘ఈ నిశ్శబ్దం మధ్యలో ఒక కుట్రను అడవి బయటపెడుతుంది. దాంతో పోచర్ కోసం వేట మొదలవుతుంది’ అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌తో ఈ పోస్టర్ విడుదలయ్యింది. దీంతో ఈ క్రైమ్ వెబ్ సిరీస్ కోసం ఆలియా భట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు స్వీకరించింది అని కూడా ప్రకటించింది అమెజాన్ ప్రైమ్.






ఇప్పటికే నిర్మాతగా సినిమా..


ఇప్పటికే ఆలియా భట్ ప్రొడ్యూసర్‌గా మారి ‘డార్లింగ్స్’ అనే సినిమాను చేసింది. నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ఈ చిత్రాన్ని ఆలియా భట్ నిర్మించడం మాత్రమే కాకుండా అందులో హీరోయిన్‌గా నటించింది కూడా. ఇక మరోసారి ‘పోచర్’ వెబ్ సిరీస్ కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మారడంపై ఆలియా స్పందించింది. ‘‘ఇలాంటి ముఖ్యమైన ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం నాకు మాత్రమే కాదు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్స్‌కు కూడా గర్వంగా భావిస్తున్నాను. పోచర్ చూపించిన ప్రభావం చాలా పర్సనల్. ప్రస్తుతం వైల్డ్ లైఫ్‌లో జరుగుతున్న నేరాలను రిచీ చూపించిన విధానం నన్ను, మా టీమ్‌ను కదిలించింది’’ అని ‘పోచర్’ గురించి చెప్పుకొచ్చింది ఆలియా భట్.


నన్ను కదిలించింది..


‘‘ఇది నిజమైన సంఘటన ఆధారంగా తెరకెక్కిందని తెలిసిన తర్వాత కథ చెప్పిన పద్ధతి నన్ను కదిలించింది. అడవులపై జరుగుతున్న ఎన్నో ఘారమైన నేరాలపై ఈ సిరీస్ దృష్టిపెట్టింది. పోచర్ చాలామంది కళ్లు తెరిపిస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. మనతో పాటు జీవిస్తున్న ప్రాణులపై ఎలా శ్రద్ధపెట్టాలో, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో ఒక పవర్‌ఫుల్ మెసేజ్ ఇస్తుంది ఈ సిరీస్. అందరూ కలిసి మెలిసి జీవించాలి అని చెప్పే లక్ష్యంతో ఇది తెరకెక్కింది’’ అని ఆలియా భట్ తెలిపింది. ‘పోచర్’ టీమ్‌లో ఆలియా చేరడం అనేది కల నిజమయినట్టుగా ఉందని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశాడు. ఫిబ్రవరీ 23 నుండి ‘పోచర్’ మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.


Also Read: జాన్వీ రాగానే.. ఆమె వెంట పడ్డారు, మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు - నెపోటిజంపై మృణాల్ ఘాటు వ్యాఖ్యలు