దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ఇతర దేశాల అభిమానులను కూడా సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. వరుసగా అంతర్జాతీయ అవార్డులను కైవశం చేసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. అంతే కాకుండా అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులైన ఆస్కార్ బరిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చోటుదక్కించుకుంది. త్వరలో జరగబోయే ఆస్కార్ వేడుకలకు మూవీ టీమ్ హాజరుకానుంది. ఈ నేపథ్యంలో దీనిపై టాలీవుడ్ యంగ్ హీరో దగ్గుబాటి రానా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 


రానా దగ్గుబాటి గురించి సినిమా ఇండస్ట్రీలో తెలియని వారుండరు. పెద్ద సినిమా బ్యాగ్రౌండ్ ఉన్నా ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రానా. కెరీర్ ప్రారంభంలోనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో రాజమౌళి అతని టీమ్ తో రానా కు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ అవార్డు వేడుకకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల ఓ ప్రముఖ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఆస్కార్ వేడుకకు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తో పాటు తాను కూడా వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వరిస్తుందని, తనకు ఆ నమ్మకం ఉందని అన్నారట రానా. ఆ సమయంలో వారిని ఉత్తేజపరచడానికి వారి టీమ్ లో తాను కూడా ఉంటే బాగుంటుందనుకుంటున్నానని రానా అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు, జక్కన్న తన చిరకాల మిత్రుడు ప్రభాస్‌ను కూడా తనతో రమ్మని ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే, దీనిపై క్లారిటీ రావల్సి ఉంది. ఎందుకంటే అవార్డుల వేడుకలకు కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. మరి, ఆ జాబితాలో బాహుబలి, భల్లాలదేవ పేర్లు ఉన్నాయో లేదా అనేది ఇప్పట్లో తెలియదు. 


ప్రస్తుతం రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ త్వరలో నెట్ ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. దీనికి అన్ని ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. అన్నీ అనుకున్నట్లుగా వెబ్ సిరీస్ విడుదల అయితే తాను కొన్ని రోజులు బయటకు వెళ్లాలని అనుకుంటున్నానని రానా వెల్లడించినట్లు సమాచారం. అయితే ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ లైవ్ ప్రదర్శనలో మీరు కూడా ఉంటారా అని రానా ను అడిగితే.. నిజానికి అంత ఉత్సాహం తనకూ ఉన్నప్పటికీ.. అది చేయడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఉన్నారని, ఆ ఐకానిక్ స్టెప్పులు వాళ్లు చేస్తేనే బాగుంటుందని బదులిచ్చారట రానా. అయితే రానా కూడా ఆస్కార్ వేదికపై ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తో కలసి కనిపిస్తారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మార్చి 12 న అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఈ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. ఈ వేదికపై ‘నాటు నాటు’ పాట లైవ్ ప్రదర్శన కోసం యావత్ భారత ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక దగ్గుబాటి రానా నటించిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ మార్చి 10 నుంచీ స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో వెంకీ, రానా పరస్పర వ్యతిరేక క్యారెక్టర్లలో కనిపిస్తుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది. 


Also Read ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌ను అవమానించిన బాలకృష్ణ?