AP Global Investors Summit 2023 : ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) విశాఖలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు చెప్పినట్లుగానే ప్రముఖ సంస్థల అధినేతలు, వ్యాపార దిగ్గజాలు విశాఖలో ప్రత్యక్షమయ్యారు. ఏపీకి రూ.13 లక్షల కోట్ల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్ తెలిపారు. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం చెప్పారు. 
జే ఫర్ జగన్.. జే ఫర్ జోష్: దాల్మియా గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా
విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొన్న దాల్మియా గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా మాట్లాడుతూ.. జే ఫర్ జగన్.. జే ఫర్ జోష్ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం వైఎస్ జగన్ కుటుంబంతో అనుబంధాన్ని షేర్ చేసుకున్నారు. "సుమారు 15 ఏళ్ల క్రితం సీఎం జగన్ తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే ఏపీతో మా అనుబంధం ప్రారంభమైంది. మేము కడప జిల్లాలో 1000 కోట్ల పెట్టుబడితో సిమెంట్ ప్లాంట్‌ను స్థాపించాము. ప్రభుత్వం నుంచి ఇక్కడ మాకు అన్ని రకాలుగా లభించిన సహకారానికి మేము సంతోషంగా ఉన్నాం. మౌలిక సౌకర్యాల విషయంలో ఏపీ అభివృద్ధి చెందడాన్ని మేము గమనించాం." అని దాల్మియా భారత్ ఎండీ పునీత్ దాల్మియా పేర్కొన్నారు. సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ, జే అంటే జగన్.. జే అంటే జోష్ అంటూ దాల్మియా కొనియాడారు.


రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి, నాయకత్వం భేష్ - నవీన్ జిందాల్
ఏపీలోని క్రిష్ణపట్నం సమీపంలో 3 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జిందాల్ గ్రూపు ఛైర్మన్ నవీన్ జిందాల్ అంగీకారం తెలిపారు. ఇందుకోసం రూ.10వేల కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు జీఐఎస్ లో ప్రకటించారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో ఎప్పటినుంచో జిందాల్ గ్రూప్ నకు సంబంధాలు ఉన్నాయని నవీన్ జిందాల్ తెలిపారు. సానుకూల అనుభవాన్ని పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఏపీని గొప్ప పారిశ్రామిక కేంద్రంగా చూస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ దూరదృష్టి, నాయకత్వం, ప్రభుత్వ విధానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు నవీన్ జిందాల్. ఏపీలోని అద్భుతమైన మౌలిక సదుపాయాలు, భారీ తయారీ కేంద్రాలు, ప్రతిభావంతులైన యువత, అద్భుతమైన  వ్యాపార అనుకూల వాతావరణం కలిగి ఉన్నాయన్నారు. 


విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ సాగిస్తున్న పయనంలో ఏపీ కీలకమని తెలిపారు. 975 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్, భారత గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యం అవుతుందన్నారు. తీరం వెంబడి ఆరు పోర్టులు కలిగి, మరో నాలుగు నిర్మాణంలో ఉన్న ఏపీ... దేశ లాజిస్టిక్ రంగంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉందన్నారు. రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. దేశ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కీలకమని   రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని చెప్పారు. రాష్ట్రం నుంచి వెళ్లేలా 5 గ్రీన్ ఫీల్డ్ జాతీయ  రహదారులను నిర్మిస్తున్నామని, దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగానే ఈ తొమ్మిదేళ్లలో 4200 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను 8700 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు.