నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను చాలా రోజుల క్రితమే మొదలుపెట్టారు. ఈ సినిమాలో బాలయ్య లుక్ ని సైతం రివీల్ చేశారు. మాస్ లుక్ లో అభిమానులను ఆకట్టుకున్నారు బాలయ్య.



ఈ సినిమాలో తమిళ, కన్నడ ఇండస్ట్రీల నుంచి కొంతమంది నటులను ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే. వారిలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ లాంటి తారలు ఉన్నారు. ఇందులో బాలయ్య సరసన హీరోయిన్ గా శృతిహాసన్ కనిపించనుంది. అలానే సెకండ్ హీరోయిన్ గా మలయాళీ ముద్దుగుమ్మ హానీ రోజ్ ను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ బయటకొచ్చింది. జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొత్త సినిమాకి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేస్తారని సమాచారం. నిజానికి నందమూరి ఫ్యాన్స్ జూన్ 10న NBK107 టీజర్ వస్తుందని అనుకున్నారు. కానీ టైటిల్ అనౌన్స్ చేయాలనీ భావిస్తున్నారు మేకర్లు. చాలా రోజులుగా దీనికి 'జై బాలయ్య' అనే టైటిల్ పెడతారని వార్తలొస్తున్నాయి. మరి మేకర్లు ఏ నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సివుంది. 

ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. అన్నాచెల్లెళ్ల మధ్య నడిచే ఈగో వార్ నేపథ్యంలో సినిమా నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు.