మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన 'ఆచార్య' (Acharya) ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు అనుకున్నంత వసూళ్లు రాలేదు. డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయి. ఓ ఏరియా డిస్ట్రిబ్యూటర్ అయితే చిరంజీవికి ఓపెన్ లెటర్ కూడా రాశారు. తనను ఆదుకోమని అందులో పేర్కొన్నారు. సహాయం చేయమని కోరారు. సినిమా రిజల్ట్ గురించి తెలుసుకున్న మెగాస్టార్, డిస్ట్రిబ్యూటర్లకు సహాయం చేసే దిశగా అడుగులు వేశారు.


ఫిల్మ్ నగర్ నుంచి అందిన విశ్వసనీయ వర్గాల ప్రకారం... 'ఆచార్య'కు చిరంజీవి, రామ్ చరణ్ రెమ్యూనరేషన్స్ తీసుకోలేదు. నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి - కొరటాల శివతో కలిసి లాభాల్లో వాటా తీసుకునేందుకు అంగీకరించారు. సినిమా థియేట్రికల్, శాటిలైట్, డిజిటల్ రైట్స్ అమ్మిన తర్వాత... అందులోంచి మేకింగ్ (ప్రొడక్షన్) కాస్ట్ తీసేయగా వచ్చిన మొత్తాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. ఒక షేర్ నిర్మాతలకు, మరో షేర్ దర్శకుడికి, రెండు షేర్స్  చిరు - చరణ్ తీసుకున్నారట.


'ఆచార్య' ఆశించిన రీతిలో ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లను ఆదుకోవడం కోసం తాము తీసుకున్న డబ్బులను చిరంజీవి, రామ్ చరణ్ తిరిగి ఇచ్చారని తెలిసింది. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ఇటీవల ఫారిన్ హాలిడే నుంచి తిరిగి వచ్చిన చిరంజీవి... 'ఆచార్య' నిర్మాతలను పిలిచి డబ్బులు ఇచ్చారని తెలిసింది. దాంతో ఇప్పుడు 'ఆచార్య' డిస్ట్రిబ్యూటర్లకు వచ్చిన లాస్‌లో కొంత భర్తీ కానుంది.


'సైరా నరసింహారెడ్డి' తర్వాత చిరంజీవి నటించిన సినిమా... 'ఆర్ఆర్ఆర్' తర్వాత రామ్ చరణ్ ఒక ప్రత్యేక పాత్ర చేసిన సినిమా... 'ఆచార్య' ఫలితం ఈ విధంగా అవుతుందని ఎవరూ ఊహించలేదు.


Also Read: మొన్న కత్రినా, ఇప్పుడు షారుఖ్ ఖాన్ - కోవిడ్ బారినపడ్డ బాలీవుడ్ స్టార్స్


'గాడ్ ఫాదర్' (God Father Telugu Movie), 'వాల్తేరు వీరయ్య', 'భోళా శంకర్' - ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. యువ దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. మరోవైపు శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న రామ్ చరణ్... ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో సినిమా చేయడానికి అంగీకరించారు. ఆ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. 


Also Read: ఇక్కడ అంత సీన్ లేదండీ - సాయి పల్లవి అంత మాట అనేశారేంటి?