బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కోవిడ్ బారిన పడినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా నటులు కార్తిక్ ఆర్యన్, కత్రినా కైఫ్, ఆదిత్య రాయ్ కపూర్ లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు ఇదే లిస్ట్ లో షారుఖ్ కూడా చేరారు. కరోనా థర్డ్ వేవ్ తరువాత కేసులు తగ్గాయనే అందరూ భావించారు. కానీ మెల్లమెల్లగా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కోవిడ్ బారిన పడుతున్నారు. 


శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'మేరీ క్రిస్టమస్' సినిమాలో నటిస్తోంది కత్రినా. ఈ సినిమా షూటింగ్ లో ఆమె జాయిన్ కావాల్సింది కానీ తనకు కరోనా పాజిటివ్ రావడంతో షూటింగ్ ను వాయిదా వేయాల్సి వచ్చింది. కోవిడ్ కారణంగానే ఆమె అబుదాబిలో జరిగిన 'ఐఫా2022' అవార్డ్స్ కి హాజరు కాలేకపోయింది.  ఇక నిన్ననే కార్తిక్ ఆర్యన్ తనకు కరోనా సోకినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అలానే ఆదిత్యరాయ్ కపూర్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాని కారణంగా తన అప్ కమింగ్ సినిమా ప్రమోషన్స్ కి దూరమయ్యారు. ఇప్పుడు షారుఖ్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. 


రీసెంట్ గానే షారుఖ్-అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించిన టైటిల్ ను అనౌన్స్ చేశారు. 'జవాన్' అనే టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. టైటిల్ ను అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఈ సినిమాతో పాటు 'పఠాన్', 'డుంకీ' వంటి సినిమాలు చేస్తున్నారు షారుఖ్. ఆయన త్వరగా కోలుకుంటే మళ్లీ ఈ సినిమాల షూటింగ్ మొదలుపెడతారు.  


Also Read: 'మేజర్' సినిమాపై బన్నీ ప్రశంసలు - మహేష్ బాబు రియాక్షన్


Also Read: ఐఫా 2022 వేడుక - అవార్డ్స్ అన్నీ ఆ సినిమాకే!