పల్నాడు ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం రాజకీయ హత్యలే చేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు గురజాల నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని శ్రేణులను ఆదేశించారు. దీంతో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


టీడీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు పాల్గొన్నారు. ప్రభుత్వం, ఆ పార్టీ చెందిన ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేశారు. గురజాల, మాచర్ల ఎమ్మెల్యేలు ఇద్దరు కలిసి పల్నాడును వల్లకాడుగా మారుస్తున్నారని విమర్శించారు. వాళ్ల కారణంగానే హత్యా రాజకీయాల పరంపర కొనసాగుతూనే ఉందని తెవిపారు.


సామాజిక న్యాయం అంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. బీసీలను హత్య చేస్తోందని ఆరోపించారు యరపతినేని . మాచర్ల నియోజకవర్గం గొల్లపాడు గ్రామంలో చంద్రయ్య అనే తెలుగుదేశం పార్టీ వ్యక్తిని నడి బజార్లో అందరూ చూస్తుండగానే హత్య చేశారని గుర్తు చేశారు. అది మర్చి పోయే లోపులోనే దుర్గి మండలం జంగమహేశ్వర పాడు గ్రామానికి చెందిన జల్లయ్య అనే వ్యక్తిని అతి కిరాతకంగా మాటువేసి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించినప్పటి నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫ్రస్ట్రేషన్‌తో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఉనికిని కాపాడుకునేందుకు, తనకు వ్యతిరేకంగా ఎవరూ పని చేయకుండా ఉండేలా భయపెట్టేందుకే హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. 


వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క గురజాల నియోజకవర్గంలోనే చాలా హత్య జరిగాయని వివరించారు యరపతినేని. ఇప్పటి వరకు తొమ్మిది మంది టీడీపీ లీడర్లను పొట్టన పెట్టుకున్నారని వివరించారు. వైసిపి మైనింగ్ దాహానికి మైనింగ్ గుంతలో పడి ఏడుగురు చిన్నారులు బలైపోయారన్నారు. 


పల్నాడు జిల్లా మాచర్లలో దుర్గి మండలం మించాలపాడు వద్ద జల్లయ్యను ప్రత్యర్థులు హత్య చేశారు. వివాహం నిమిత్తం బంధువులను పిలిచేందుకు జంగమహేశ్వరపాడు వచ్చి వెళ్తున్నప్పు ప్రత్యర్థులు కాపు కాచి దాడి చేశారు. దీంతో ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఇది కచ్చితంగా పిన్నెల్లి ప్రోత్సాహంతో జరిగిన హత్యే అంటూ టీడీపీ  ఆందోళన బాటపట్టింది. ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.