ఓటీటీల హవా పెరిగిన తరువాత వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలిమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. కరోనా కారణంగా థియేటర్ల వ్యవస్థ దెబ్బతినడంతో.. మన హీరోలు, దర్శకులు కూడా ఓటీటీలపై ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో ఈ కల్చర్ పెద్దగా కనిపించినప్పటికీ.. తమిళంలో మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే 'పావ కథైగల్' అనే వెబ్ ఫిలిం తీశారు. ఇందులో సాయి పల్లవి, అంజలి, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్లు కనిపించారు. ఇందులో నాలుగు కథలుంటాయి. ఒక్కో కథను ఒక్కో డైరెక్టర్ తెరకెక్కించారు. ఇలాంటి వాటిని ఆంథాలజీ సినిమాలంటారు. 

 

ఇలానే అలానే తొమ్మిది కథలతో మరో ఆంథాలజీ తీయబోతున్నారు. 'నవరస' (Navarasa) అనే పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం తొమ్మిది మంది సౌత్ స్టార్ దర్శకులు, హీరో హీరోయిన్లు ముందుకు వస్తున్నారు. మణిరత్నం, జయేంద్ర కలిసి ఈ వెబ్ ఫిల్మ్ ను నిర్మించబోతున్నారు. ఇక ఇందులో సూర్య, సిద్ధార్థ్, ప్రకాష్ రాజ్, రేవతి, నిత్యామీనన్,  పార్వతీ, ఐశ్వర్యా రాజేష్, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి లాంటి స్టార్లు నటిస్తున్నారు. ఒక్కొక్కరి కథ ద్వారా ఒక్కో రసాన్ని పండించబోతున్నారు. 

 

తొమ్మిది భాగాలుగా రానున్న ఈ సిరీస్ ఒక్కో భాగాన్ని ఒక్కో డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్‌ఫ్లిక్స్‌' వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ ని విడుదల చేసింది చిత్రబృందం.  టైటిల్‌కి తగ్గట్టుగానే అన్ని రకాల భావోద్వేగాలతో ఆద్యంతంగా ఆసక్తిగా సాగింది ఈ ట్రైలర్.

 

ప్రతీ నటుడు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారని తెలుస్తోంది. అందరి లుక్స్‌ చాలా కొత్తగా ఉన్నాయి. ఒక్కో డైలాగ్ తో ఆసక్తిని క్రియేట్ చేశారు. సూర్య, విజయ్ సేతుపతిల గెటప్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ట్రైలర్ కు నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. అగ్ర తారలందరినీ ఒకే వీడియోలో చూస్తుండటం కొత్త అనుభూతిని పంచుతోంది.

 


రతీంద్రన్‌ ఆర్‌. ప్రసాద్‌, అరవింద్‌ స్వామి, బిజోయ్‌ నంబియార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, సర్జున్‌ కె.ఎం, ప్రియదర్శన్‌, కార్తీక్‌ నరేన్‌, కార్తీక్‌ సుబ్బరాజ్‌, వసంత్‌ ఈ తొమ్మిది కథలకి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ కోసం ముగ్గురు సినిమాటోగ్రాఫర్లు, ఆరుగురు సంగీత దర్శకులు పని చేశారు. తమిళ చిత్ర పరిశ్రమకి చెందిన సినీ కార్మికులని ఆదుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్‌ రూపొందించారు.