ప్రముఖ నటుడు నరేష్ విజయకృష్ణ (Naresh VK) పేరు చెప్పి, ఆయన మాజీ భార్య రమ్య రఘుపతి అప్పులు చేసిన విషయం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. నరేష్ ఆస్తులు చూపించి ఆమె అప్పులు చేసినట్టు వార్తలు రావడంతో అందరూ ఆయనకు ఫోనులు చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో రమ్య రఘుపతికి, తనకు సంబంధం లేదని నరేష్ స్పష్టం చేశారు.


"రమ్య రఘుపతి ఆర్ధిక సమస్యల విషయం బయటకు రావడంతో నాకు మీడియా, బంధుమిత్రుల నుంచి విపరీతంగా ఫోనులు వస్తున్నాయి. నాకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు. ఈ విధంగా జరిగిందని నాకు నిన్న, మొన్నటి వరకూ తెలియదు. మాకు పెళ్ళై తొమ్మిదేళ్లు అవుతోంది. రెండు మూడేళ్ళ తర్వాత... అంటే దాదాపు ఐదారేళ్ళ క్రితమే విడిపోయాం. ఇటువంటి సమస్యలు ఉన్నాయని తెలిసి, మరీ సమస్య పెరుగుతుందేమో అనే భయంతో విడిపోయాం. ఎవరికి వారు మా జీవితాలను గౌరవంగా గడుపుతున్నాం. మేం వేర్వేరుగా ఉన్నాం. మాకు సంబంధం లేదు. మూడు నెలల క్రితమే రమ్య రఘుపతికి, నాకు ఎటువంటి సంబంధం లేదని పబ్లిక్ నోటీస్ కూడా ఇచ్చాను. ఎందుకంటే... ప్రజలకు తెలియాలని! రెండు మూడు రోజులుగా నాకు విపరీతంగా ఫోనులు వస్తున్నాయి. ఎవరో పోలీస్ కంప్లైంట్ ఇస్తే... ఫోన్ వచ్చింది. నాకు వీలైనంత సహాయం చేస్తానని పోలీసులకు చెప్పాను. మాకు ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలియదు కాబట్టి... ఈ విషయంలో ఇంతకు మించి చెప్పలేను" అని నరేష్ వీకే ఓ వీడియో విడుదల చేశారు.


Also Read: నరేష్ ఆస్తులు చూపించి అప్పులు - మాజీ భార్య నిర్వాకంతో నటుడికి చిక్కులు!


అనంతపురం జిల్లాకు చెందిన రమ్య రఘుపతి (Ramya Raghupathi), ఓ మాజీ మంత్రికి  బంధువుని తెలుస్తోంది. నరేష్ వీకేతో వేరుపడినప్పటికీ... ఆయన పేరు చెప్పి ఆమె అప్పులు చేసినట్టు తెలుస్తోంది. రమ్యపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఐదుగురు మహిళలు ఫిర్యాదులు చేశారు.


Also Read: 'శ్రీ శ్రీ రాజావారు'గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఎన్టీఆర్ బావమరిది