Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఆయన నటించిన ‘ధూత’ వెబ్ సిరీస్ ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. పాకిస్తాన్ అధికారులకు చిక్కిన తెలుగు మత్స్యకారుల కథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు. సోషల్ మీడియా వేదికగా చిన్న హింట్ ఇచ్చారు.


మార్చి 19న నాగ చైతన్య ఏం చెప్పబోతున్నారు?


తాజాగా నాగ చైతన్య చిన్న వీడియో క్లిప్ ను తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఆయన మార్చి 19న ఇవ్వబోయే సర్ ప్రైజ్ ‘దూత’ వెబ్ సిరీస్ గురించే అయి ఉంటుందని చర్చించుకుంటున్నారు. ‘దూత’ వెబ్ సిరీస్ ను విక్రమ్ కే కుమార్ తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నాగ చైతన్య ఈ వెబ్ సిరీస్ తోనే డిజిటల్ వేదికపైకి అడుగు పెట్టారు. గత ఏడాది డిసెంబర్ 1న ‘ధూత’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల అయ్యింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు పలు భాషల్లో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ అప్పట్లో అమెజాన్ లో ట్రెండింగ్ లో నిలిచింది. విడుదలై నాలుగు నెలలు గడుస్తున్నా, ఇప్పటికీ టాప్ వెబ్ సిరీస్ ల లిస్టులో ‘ధూత’ ఒకటిగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగ చైతన్య అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు.  మార్చి 19న ఆయన చెప్పబోయేది ‘దూత’ వెబ్ సిరీస్ గురించేననే టాక్ వినిపిస్తోంది.






‘దూత’ సమయంలోనే సీక్వెల్ పై కీలక వ్యాఖ్యలు


నిజానికి ‘దూత’ వెబ్ రిలీజ్ సమయంలో చిత్రబృందం ఓ కీలక విషయాన్ని వెల్లడించింది. ఈ సిరీస్ ప్రేక్షకులు నచ్చితే,  సీక్వెల్ గురించి ఆలోచిస్తామని వెల్లడించింది. అయితే, తెలుగు వెబ్ సిరీస్ లలో ‘దూత’ టాప్ ప్లేస్ లో నిలిచింది. మొత్తం 8 ఎపిసోడ్ లతో ఉన్న ఈ వెబ్ సిరీస్ బాగా ఆకట్టుకుంది. ఇన్వెస్టిగేషన్ కథాంశంతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను అద్భుతంగా అలరించింది. ఈ నేపథ్యంలో ‘దూత’ సీక్వెల్ గురించి అఫీషియల్ ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.  ‘దూత’ సిరీస్ లో  గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు నాగ చైతన్య. చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో ఆయన సాగర్ అనే జర్నలిస్టుగా కనిపించాడు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్ గా నటించింది. రవీంద్ర విజయ్, చైతన్య గరికపాటి, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల ఇతర పాత్రల్లో కనిపించారు.


Read Also: గ్లింప్స్ వచ్చేస్తోంది- ఇమ్రాన్ హష్మీ చెప్పింది ‘ఓజీ’ గురించేనా?