నాగచైతన్య తర్వాతి సినిమా కోసం గట్టిగా సిద్ధం అవుతున్నారు. ఈసారి సినిమా కోసం ఇంకా ఎక్కువగా కష్టపడుతున్నారు. మత్స్యకారుల నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం నాగచైతన్య కూడా మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ‘కార్తికేయ 2’ ఫేమ్ చందు మొండేటి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమాను రూపొందించనున్నారు.


ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుందని నిర్మాతలు ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారులతో కలిసి హీరో నాగ చైతన్యతో పాటు బన్నీ వాసు కూడా చేపల వేటకు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా గీతా ఆర్ట్స్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది. 


2018లో గుజరాత్ నుంచి చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ కోస్ట్‌ గార్డ్‌ల‌కు చిక్కిన 21 మంది మత్స్యకారుల్లో ఒకరైన రామారావు జీవిత కథ ఆధారితంగా నాగచైతన్య కొత్త సినిమా రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. మత్స్యకారుల వలసలు, పాకిస్తాన్ వారికి చిక్కడం, అక్కడి నుంచి భారత్‌కు రావడం వంటి కథాంశంతో ఈ సినిమా రెడీ కానుందట. 


‘కస్టడీ’ ఆశించిన ఫలితం సాధించలేక పోవడంతో నాగ చైతన్య ఆశలన్నీ తర్వాత రానున్న చందు మొండేటి సినిమా మీదనే ఉన్నాయి. ‘కస్టడీ’ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. ఏడు కోట్ల షేర్ మాత్రమే లభించింది. గ్రాస్ లెక్క అయితే రూ.15 కోట్లకు కాస్త అటూ ఇటుగా ఉంది. దీంతో ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో కనీసం సగం వసూళ్లను కూడా ‘కస్టడీ’ సాధించలేకపోయింది.


తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' సినిమాను తెరకెక్కింది.  పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ‘కస్టడీ’ని నిర్మించారు. హ్యాపెనింగ్ హీరోయిన్ కృతి శెట్టి... నాగచైతన్య సరసన నటించారు. అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి వంటి పెద్ద నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ద్వయం ఈ సినిమాకు సంగీతాన్ని అందించింది. ఈ  సినిమాకు విడుదల అయిన మొదటి ఆట నుంచే అన్ని చోట్లా  మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆడియన్స్ నుంచి ఆశించిన రీతిలో రెస్పాన్స్ రాలేదు. విడుదలకు ముందు ఎక్కువ బజ్ కూడా క్రియేట్ కాలేదు. దీంతో తొలి రోజు నుంచే కలెక్షన్లు కొంచెం తక్కువగా వచ్చాయి.