సినిమా పరిశ్రమలోని హీరోలు అంతా కలిసి మెలిసి ఉన్నా, ఒకప్పుడు అభిమానులు మాత్రం తమకు నచ్చని హీరోల పట్ల తీవ్ర కోపాన్ని, పగను, ద్వేషాన్ని కలిగి ఉండేవారని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. ఆ కారణంగానే ఇతర హీరోల వాల్ పోస్టర్లను చించండం, పేడ చల్లడం లాంటి పనులు చేసేవారని వెల్లడించారు. తాను హీరో అయ్యాక ఈ పద్దతిని రూపు మాపేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. పార్టీ కల్చర్ ను తీసుకొచ్చి అందరు హీరోలను ఒక్క దగ్గరికి చేర్చినట్లు వెల్లడించారు.


“నేను సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొత్తలో రామారావు, నాగేశ్వర్ రావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు లాంటి హీరోలంతా కలిసి మెలిసి ఉన్నా.. వారి అభిమానులు మాత్రం చాలా అతిగా ప్రవర్తించే వారు. ఒకరి మీద మరొకరికి పగ, ద్వేషం ఉండేది. తమకు నచ్చని హీరోల వాల్ పోస్టర్లు చింపివేయడం, ఆశుద్ధాని వేయడం, లేనిపోని గొడవలు తెచ్చుకోవడం లాంటివి చేసేవారు.  ఆ పరిస్థితిని చూస్తుంటే నాకు చాలా బాధ కలిగేది. ఎవరైనా సినిమాలు చేయవచ్చు. ఎవరి సినిమానైనా ఆదరించవచ్చు. ఎవరి అభిమానులం అయినా, ఎదుటి వారిని గౌరవించాలి. మన ప్రేమను చాటుకోవాలి. అంతేగానీ, నెగెటివిటీ ప్రదర్శించకూడదు. ఒకవేళ నేను హీరోగా ఎదిగితే ఇలాంటి అసూయ భావాన్ని పోగొట్టాలి అనుకున్నాను. ముందుగా హీరోల మధ్య మంచి వాతావరణాన్ని తీసుకురావాలి అనుకున్నాను. అలా చేస్తే, అభిమానులు అందరూ మారుతారు అనుకున్నాను” అని చెప్పారు చిరంజీవి.


అటు హీరోల మధ్య స్నేహ భాగం పెంపొందించేందుకు పార్టీ కలర్చర్ ను అలవాటు చేసినట్లు మెగాస్టార్ వెల్లడించారు. “ హీరోల మధ్య స్నేహాన్ని నెలకొల్పేందుకు పార్టీ కల్చర్ అనే విషయాన్ని ముందుకు తెచ్చాను. ఒక సినిమా విజయం సాధించినా, 100 రోజుల వేడుక జరుపుకున్నా, కొత్త సినిమా ముహూర్తం జరుపుకున్నా, మిగతా హీరోలు అందరినీ పిలిచే వాడిని. వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మోహన్ బాబుతో పాటు దర్శకులను, తమిళ నటీనటులను ఆహ్వానించి పార్టీలు ఇచ్చే వాడిని. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మూలంగా హీరోల మధ్య మంచి స్నేహ వాతావరణం ఏర్పడింది. అభిమానుల్లోనూ కొంత మేర వ్యతిరేక భావం తగ్గింది” అని చెప్పారు.


తన సినిమాల ద్వారా కూడా ఇతరులను ప్రేమించాలనే సందేశాన్ని ఇచ్చినట్లు చిరంజీవి చెప్పారు. ”నేను నటించిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో ఓ హౌస్ కీపింగ్ వ్యక్తి హాస్పిటల్లో ఫ్లోర్ ను తూడుస్తుంటాడు. అటు ఇటు వెళ్లే వాళ్లు తొక్కుతుంటారు. దీంతో అతడికి చాలా కోపం వస్తుంది. విసుగు కలుగుతుంది. తుడిచాక ఆరేంత వరకు ఆగకుండా నడుస్తున్నారని ఆగ్రహం వస్తుంది. అప్పుడు నేను అతడి దగ్గరికి వెళ్లి ఆలింగనం చేసుకుని థ్యాంక్స్ చెప్పడంతో తను ఎంతో సంతోష పడతాడు. ఎంత మంది మళ్లీ మళ్లీ తొక్కినా, నీటుగా తూడుస్తూనే ఉంటాడు. ఒక హగ్ ఎదుటి వారిని ఐస్ చేస్తుంది” అని చెప్పారు. హైదరాబాద్ లో బండారు దత్తాత్రేయ కూతురు ఏర్పాటు చేసిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో చిరంజీవి ఈ విషయాలు చెప్పారు.






Also Read: మమ్ముట్టి ‘భీష్మ పర్వం’ మూవీని రామ్ చరణ్ రీమేక్ చేయనున్నారా?
Also Read: అహంకారానికి మమకారమే సమాధానం - గరికపాటి వివాదంపై బ్రహ్మాజీ, శ్రీనివాస కుమార్ సీరియస్ కామెంట్స్!