Guntur Kaaram Movie Amma Lyrical Song: టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ‘అత‌డు’, ‘ఖ‌లేజా’ లాంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అయితే, ఈ సినిమా తొలి షో నుంచే మిశ్రమ స్పందన లభించింది. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది.  


ఆకట్టుకుంటున్న ‘అమ్మ’ లిరికల్ సాంగ్


ఇక ఈ సినిమాలో పాటలు మాత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి ‘ధమ్ మసాలా’, ‘కుర్చీ మడత పెట్టి’, ‘ఓహ్ మై బేబీ’ సాంగ్స్ విడుదలై చార్ట్ బ‌స్ట‌ర్లుగా నిలిచాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ‘అమ్మ’ అనే ఈ పాట ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటోంది. ‘ప‌సి వాడ‌యై వేచి చూస్తుందా బదులే రాని గతం.. ప‌గ వాడ‌యై నింద మోస్తుందా ఎదుటే ఉన్న నిజం’ అంటూ ఆకట్టుకుంటోంది. ఈ పాట‌ ప్రముఖ సినీ రచయిత రామజోగయ్య శాస్త్రి రాశారు. విశాల్ మిశ్రా అద్భుతంగా ఆలపించారు.  థమన్ సంగీతం ఆకట్టుకుంటోంది.   



గుంటూరు కారం' గురించి..


మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన కమర్షియల్ మూవీనే 'గుంటూరు కారం'. 2022లో విడుదలైన 'సర్కారు వారి పాట' తర్వాత ఆయన నటించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. అలాగే, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలను పోషించారు. థమన్ సంగీతం అందించిన ఈ సినిమాను హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమాతో పోటీగా బరిలో నిలిచిన ‘హనుమాన్’ మూవీ, ‘గుంటూరు కారం’ సినిమాను మించి సక్సెస్ టాక్ తో దూసుకెళ్లింది. ఏకంగా మహేష్ బాబు సొంత మల్టీఫ్లెక్స్ లోనూ ఈ మూవీ షోలు క్యాన్సిల్ కావడంతో చిత్రబృందం షాక్ అయ్యింది. కానీ, ఆ తర్వాత ఊపందుకుంది. మంచి వసూళ్లు సాధించింది.


SSMB29 పనులు షురూ


అటు మహేష్ బాబు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో కలిసి పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. SSMB29 పేరుతో ఈ సినిమా పనులు కొనసాగుతున్నాయి.‘RRR’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత రాజమౌళి ఈ పాజెక్టును చేపట్టగా, ఈ మూవీతో మహేష్ బాబు పాన్ ఇండియన్ హీరోగా మారబోతున్నారు. ఈ నేపథ్యంలో SSMB29 భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ను మ‌హేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగ‌స్టు 9న మొదలు పెడతారని తెలుస్తోంది.ఈ చిత్రంలో విలువైన వస్తువుల అన్వేషణలో మహేష్ బాబు గ్లోబల్ ట్రాటింగ్ ఎక్స్‌ ప్లోరర్‌గా కనిపించనున్నట్లు సమాచారం.   


Read Also: అభిమానుల వల్లే ఈ అవార్డు దక్కింది, పద్మవిభూషణ్ ప్రకటనపై మెగాస్టార్ ఎమోషనల్