Mahesh Babu Birthday: మహేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం మహేష్ బాబుకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అయితే, అందరి విషెస్ కంటే ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ పెట్టిన విషెస్ ప్రత్యేకమనే చెప్పుకోవాలి. 


ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నమ్రత శిరోద్కర్ మహేష్ బాబుకు అభినందనలు తెలిపారు. ‘‘మరెవ్వరికీ సాధ్యం కాని విధంగా నువ్వు నా ప్రపంచంలో వెలుగులు నింపావు. హ్యపీ బర్త్ డే MB. ఇలాగే మరిన్ని ఏళ్లు క్రేజీగా మన బంధాన్ని కొనసాగిద్దాం. లవ్ యూ’’ అని మహేష్ బాబును ట్యాగ్ చేస్తూ విషెస్ చెప్పారు. కేవలం నమ్రతా మాత్రమే కాదు. చాలా మంది స్టార్ హీరోలు సైతం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మహేష్ బాబుకు బర్త్ డే విషెస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, మంత్రి రోజా ప్రత్యేక అభినందనలు తెలిపారు. సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వేలాది మంది శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.


టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్..!


టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో మహేష్ బాబు, నమ్రత ఒకరు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, అనురాగం గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నమ్రత.. ఎప్పటికప్పుడు తన భర్త, పిల్లల గురించి పోస్టులు పెడుతూనే ఉంటుంది. సితార చేసే అల్లరి, డ్యాన్స్, వారి వెళ్లిన వెకేషన్ ట్రిప్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.


ఒక్కడు, పోకిరి సినిమాల ప్రదర్శన..


మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు.. 2003లో మహేశ్ నటించిన రొమాంటిక్, యాక్షన్ సినిమాలు ‘పోకిరి’, ‘ఒక్కడు’ చిత్రాలను మంగళవారం థియేటర్లలో ప్రదర్శించారు. వాటితో వచ్చే డబ్బును చిన్న పిల్లల గుండె ఆపరేషన్ల కోసం.. ఎంబీ ఫౌండేషన్‌కు అందజేస్తామని తెలిపారు. ముఖ్యంగా పోకిరి సినిమాను రీమాస్టర్ చేసి 4Kలో రీ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ఈ సినిమా చూసేందుకు చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదట కొన్ని థియేటర్లలలో మాత్రమే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అభిమానుల రెస్పాన్స్ అంతకంతకూ పెరగడంతో స్క్రీన్ల సంఖ్య పెంచుతూ వచ్చారు. ఇండియాతో పాటు ఓవర్సీస్‌తో కలిపి 175 స్క్రీన్స్ లో పోకిరిని 4K వెర్షన్‌లో విడుదల చేసినట్లు సమాచారం. 


అత్యధిక సెంటర్లలో రెండోసారి ఈ సినిమా రిలీజ్ కాబోతుండగా... రీ రిలీజ్ కు మూడు రోజుల ముందే అన్ని షోల టికెట్లు అమ్ముడైపోయాయి. హైదరాబాద్ లోని ప్రధాన థియేటర్స్ అన్నింటిలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఏపీలోని పలు నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించిన కొద్ది గంటల్లోనే థియేటర్లు హౌజ్ ఫుల్ అవటం ప్రేక్షకులను ఖుషీ చేస్తోంది. అమెరికాలో దాదాపు 24 థియేటర్లలో పోకిరి స్క్రీనింగ్ కాబోతుంది. ఈ సినిమా విడుదలై పదహారేళ్లు అవుతున్నా ఎక్కడా క్రేజ్ తగ్గకపోవడం గమనార్హం.