తెలుగులో ‘వారిసు’ సినిమా విడుదలపై కొద్ది రోజులుగా వివాదం రాజుకుంటోంది. సంక్రాంతి సందర్భంగా కేవలం తెలుగు సినిమాలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలని టాలీవుడ్ నిర్మాతల సంఘం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కోలీవుడ్ దర్శక, నిర్మాతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ నిర్ణయాన్ని పూర్తిగా తప్పుబడుతున్నారు. ఇప్పటికే పలువురు దర్శక, నిర్మాతలు ఈ అంశంపై స్పందించగా, తాజాగా డైరెక్టర్ లింగుస్వామి సైతం తీవ్ర స్థాయిలో స్పందించారు. తెలుగు నిర్మాతల సంఘం తీసుకున్న నిర్ణయం తమకు ఏమాత్రం అంగీకారం కాదన్నారు. ఒకవేళ తెలుగు సినిమా నిర్మాతలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

  


తెలుగు నిర్మాతల నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన లింగుస్వామి


తెలుగు నిర్మాత తీరును తప్పుబడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలుగు నిర్మాతల సంఘం తీసుకున్న నిర్ణయం.. తమిళ సినిమా పరిశ్రమకు కూడా మంచిదని భావిస్తున్నా. పాన్ ఇండియా సినిమాలు అనేవి ఇక్కడ కొత్త కాదు. తమిళ సినిమా పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు విడుదలై దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాయి. ఓటీటీ బాగా విస్తరించింది. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, అన్ని భాషల సినిమాలను చూసే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగు నిర్మాతలు తీసుకున్న నిర్ణయం అమలు అయితే, ‘వారిసు’కు ముందు, తర్వాత అనేలా సినిమా రంగం ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. తమిళ నాట తెలుగు సినిమాల పరిస్థితి అత్యంత దారుణ స్థితికి చేరుకుంటుంది. అందుకే తెలుగు, తమిళ సినిమా పరిశ్రమకు చెందిన పెద్దలు కూర్చొని ఈ అంశంపై ఉమ్మడి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే, మేం ఏం చేయాలో అదే చేస్తాం” అని లింగుస్వామి తీవ్రంగా హెచ్చరించారు.



తెలుగు నిర్మాతల మండలి నిర్ణయం జరిగే పని కాదన్న అల్లు అరవింద్


తాజాగా ఇదే అంశంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తెలుగు సినిమా నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయం జరిగే పని కాదని తేల్చి చెప్పారు. మరికొంత మంది దర్శక నిర్మాతలు సైతం నిర్మాతల మండలి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. తమిళ హీరో విజయ్ కీలక పాత్రలో వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘వారిసు’. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా ‘వారసుడు’గా విడుదల కాబోతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని సినిమా యూనిట్ నిర్ణయించింది.   


Read Also: ఇండియానా జోన్స్ రేంజ్‌లో అడ్వెంచర్స్ - మహేష్ బాబు మూవీపై కీలక విషయాలు చెప్పిన రాజమౌళి