‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటారు దర్శకుడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా, కొమురం భీం, సీతా రామ రాజు పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగు సినిమా పరిశ్రమతో పాటు దేశ, విదేశాల్లోనూ సంచలన విజయాన్ని అందుకుంది. తాజాగా జపాన్ లో విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. బాహుబలి సినిమా తర్వాత ఆరేంజిలో విజయాన్ని అందుకుంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్లు జక్కన్న వెల్లడించాడు. అయితే, సినిమా కథకు సంబంధించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నా, ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు.


ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కనిపించని యాక్షన్ అడ్వెంచర్ మూవీ


తాజాగా తన తర్వాతి ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను స్వయంగా జక్కన్నే వివరించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి అమెరికాలో ప్రచారం చేస్తున్న రాజమౌళి.. నెక్ట్స్ మూవీ వివరాలను వెల్లడించాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీ తర్వాతి సినిమా కథ ఏమిటని అడిగిన ప్రశ్నకు.. ఆయన కీలక విషయాలు వివరించారు. తనకు అడ్వెంచర్ సినిమాలు అంటే ఎంతో ఇష్టమని చెప్పారు. ఇండియన్ సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు కనిపించని సరికొత్త యాక్షన్ అడ్వెంచర్ మూవీని రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఇండియానా జోన్స్ తరహా చిత్రంలా రూపొందిస్తున్నట్లు తెలిపాడు.   


స్ట్రిప్ట్ వర్క్ జరుగుతోందన్న జక్కన్న


“ఇప్పుడే నా తర్వాతి సినిమా గురించి చెప్పడం కాస్త కష్టం. మామూలుగా నా సినిమాలన్నింటికీ, మా నాన్న విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుంటారు. నా తర్వాత సినిమాకు సంబంధించిన కథ గురించి మా టీం అంతా చర్చిస్తారు. రెండు నెలల క్రితమే నా నెక్ట్స్ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాం. ఈ చిత్రం తనకు బాగా నచ్చిన హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ మాదిరిగా ఉండాలని భావిస్తున్నాను. నేను చాలా కాలంగా ఓ అడ్వెంచర్ సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు స్వయంగా అడ్వెంచర్ థ్రిల్లర్స్ అంటే ఇష్టం. అలాంటి కథతోనే ఈ సినిమా తెరకెక్కుతుందని మాత్రం చెప్పగలను” అంటూ జక్కన్న హింట్ ఇచ్చారు.






‘బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ను మించి ఉండేలా జాగ్రత్తలు   


మొత్తంగా తన తర్వాత సినిమా ‘బాహుబలి, ‘ఆర్ఆర్ఆర్’ను మించి ఉండేలా జక్కన్న సినిమా కథను చెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకపోయినా, కేఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరించబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు టాక్ నడుస్తోంది. తన కెరీర్ లోనే అద్భుత సినిమాగా ఈ చిత్రాన్ని రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నా అని అన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. MB28గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలయ్యింది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Read Also: నాగశౌర్య వరుడయ్యాడు, ఈ రోజే పెళ్లి - హల్దీ వేడుక ఫొటోలు వైరల్