భరత్ అనే నేను సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కియారా. రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ సినిమాలో కూడా నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ బిజీ హీరోయిన్లలో కియారా ఒకరు. ఆమె నటించిన హారర్ - కామెడీ సినిమా ‘భూల్ భులయ్యా 2’ ఇటీవలే విడుదలైంది. త్వరలో మరో సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఆమె ఒక మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను అభిమానులతో పంచుకుంది. హారర్ సినిమాలో నటించిన కియారా తనకు దయ్యాలంటే భయమే లేదని చెప్పుకొచ్చింది. దయ్యాలున్నాయంటే తాను నమ్మనని, దయ్యాల సినిమాలు కూడా చూడనని తెలిపింది. తాను ఒక్కతినే గదిలో పడుకోవాలి కనుక హారర్ సినిమాలు చూడడం మానేశానని చెప్పింది. తాను జీవితంలో ఓసారి మాత్రం చాలా భయపడ్డానని, చావు అంచుల దాకా వెళ్లొచ్చానని గుర్తు చేసుకుంది. 


ఆ రోజును మర్చిపోలేను...
కియారా తాను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ప్రమాదకరఘటనను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నట్టు తెలిపింది. ఆ రోజును తలచుకుంటూ ఇలా చెప్పుకొచ్చింది... ‘కాలేజీ స్నేహితులతో కలిసి ధర్మశాలలోని మెక్ లియోడ్ గంజ్ అనే ప్రాంతానికి వెళ్లాము. అక్కడ విపరీతంగా మంచు పడుతోంది. ఎక్కడికీ వెళ్లలేక హోటల్లోనే నాలుగు రోజులు పాటూ ఉన్నాము. నీరు, ఆహారం కూడా సరిగా అందలేదు. గదిలో వెచ్చదనం కోసం వేసుకున్న మంట కూడా ఆరిపోయేలా అనిపించింది. నాలుగో రోజు అందరం నిద్రపోతున్నాం. ఆ మంట పక్కనే ఉన్న కుర్చీకి అనుకోకుండా అంటుకుంది. దీంతో గదిలో మంటలు చెలరేగాయి. గదంతా పొగ అలుముకుంది. మా స్నేహితుల్లో ఒకరికి మెలకువ వచ్చింది. ఆమె అందరినీ లేపింది. నాకు చాలా భయం వేసింది. దాదాపు ఆ పొగ, మంటలు చూశాక చావు అంచుల దాకా వెళ్లినట్టు అనిపించింది. మా అరుపులకి చుట్టు పక్కల వాళ్లంతా వచ్చి తలుపులు పగులగొట్టి, మమ్మల్ని బయటికి తీసుకొచ్చారు’. ఈ ఘటన తన జీవితంలో చాలా భయపడిన సందర్భమని తెలిపింది. 


కియారా సినిమాల విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేస్తోంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. డైరెక్ట్ సినిమాలు చేసేందుకు తాను ఇస్టపడతానని, రీమేక్ సినిమాలు చేసే ముందు చాలా సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెబుతోంది. తెలుగులో రెండు సినిమాల్లో నటించిన కియారా రామ్ చరణ్ తో కలిసి మరో సినిమాలో నటించబోతోంది.  


Also read: ‘మురారి వా’ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో వచ్చేసింది



Also Read: బాలకృష్ణకు జోడిగా నటించిన హీరోయినే ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో విలన్‌గా?