తమిళ హీరో కార్తీ నటించిన 25వ సినిమా ‘జపాన్’. దీపావళి సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. యాక్షన్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘జపాన్’ రానున్నట్లు ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ‘కుకూ’, ‘జోకర్’ వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాలు తీసిన రాజు మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్స్ బ్యానర్‌పై ఎస్ఆర్ ప్రభు ‘జపాన్’ను నిర్మించారు.


ఇక ట్రైలర్ విషయానికి వస్తే... చిన్న వయసులో తల్లి కోసం చిన్న చిన్న దొంగతనాలు చేసి అదే అలవాటుగా మార్చుకున్న జపాన్ అనే యువకుడి పాత్రలో కార్తీ కనిపించనున్నారు. హైదరాబాద్‌లో మినిష్టర్ ఇంట్లో రూ.200 కోట్లు దొంగతనం చేసి, హత్య కూడా చేశాడన్న నింద జపాన్‌పై పడుతుంది. దీంతో పోలీసులు అందరూ జపాన్‌ను ఎన్‌కౌంటర్ చేయడానికి తిరుగుతూ ఉంటారు. చేయని నేరానికి జపాన్‌ను ఇరికించాలని మరోవైపు పోలీసులు ప్రయత్నిస్తూ ఉంటారు. దీని నుంచి జపాన్ ఎలా బయటపడ్డాడు అనేదే కథగా ఉన్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.



ట్రైలర్‌లో ఫన్నీ డైలాగ్స్‌కు కూడా కొదవ లేదు. ‘బదులు తెలియనప్పుడు అమ్మాయిలు ఏం చేస్తారో చెప్పనా... ఏడుస్తారు.’ ,‘సింహం కాస్త సిక్ అయితే, పందికొక్కులు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి పెట్టాయంట.’, ‘మీరు చెప్పిన కథలో ఆ తిమింగలాన్ని పట్టేసుకున్నారా’ అని అడిగినప్పుడు కార్తీ డిఫరెంట్ వాయిస్ మాడ్యులేషన్‌లో ‘ఓ... సి సెంటర్ దాకా రీచ్ అయిందా?’ అని అడగటం వంటివి బాగా ఫన్నీగా ఉన్నాయి.


‘జపాన్’ మూవీ తెలుగు రైట్స్‌ని కింగ్ నాగార్జున దక్కించుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 'జపాన్' తెలుగు హక్కులను ఫ్యాన్సీ రేట్‌కి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్ కార్తీ సినిమాని దక్కించుకోవడంతో తెలుగులోనూ 'జపాన్' భారీ ఎత్తున విడుదల కానుంది. ఈమధ్య ఇతర భాషల సినిమాలను సితార ఎంటర్టైన్మెంట్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వంటి అగ్ర నిర్మాణ సంస్థలు తెలుగు ప్రేక్షకులకు అందిస్తుంటే కార్తీ 'జపాన్' తెలుగు రైట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ దక్కించుకుంది. నాగార్జునకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ కి కార్తీ జపాన్ తెలుగు రైట్స్ ఇవ్వడం వెనక ఓ రీజన్ ఉందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.


కార్తీతో నాగార్జునకి మంచి అనుబంధం ఉంది. వీళ్ళిద్దరి కాంబినేషన్లో 'ఊపిరి' సినిమా కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఊపిరి నుంచి కార్తీక, నాగార్జున మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. కార్తీ నటించిన ప్రతి సినిమాకి నాగార్జున బెస్ట్ విషెస్ అందిస్తారు. కార్తీ నటించిన ‘సర్దార్’ను కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌నే పంపిణీ చేసింది. ఈ క్రమంలోనే కార్తీ నటించిన 'జపాన్' సినిమా తెలుగు హక్కులను నాగార్జున భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో కార్తీ మరో డిఫరెంట్ మేకవర్ తో అలరించబోతున్నాడు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial