ఇటీవలే బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ' సినిమాను పూర్తి చేసిన బాలయ్య తన తదుపరి సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేయనున్నారు. ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మలినేని ఈసారి బాలయ్య కోసం మరో మాస్ సబ్జెక్ట్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. వందేళ్ల కాలం నుంచి వేటపాలెంకు సంబంధించిన వార్తా పత్రికలన్నీ తిరగేసి ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారు దర్శకుడు గోపీచంద్. కథ ప్రకారం.. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్‌గా, ఫ్యాక్షనిస్ట్‌ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని సమాచారం. 

 


 

ఈ సినిమా ఇద్దరు హీరోయిన్లు కూడా ఉంటారట. అందులో ఒకరిగా శృతిహాసన్ ను ఎంపిక చేసుకున్నారు. దీపావళి పండగ సందర్భంగా.. ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక తాజాగా సినిమాలో విలన్ పాత్ర కోసం క్రేజ్ ఉన్న స్టార్ ను రంగంలోకి దింపుతున్నారని సమాచారం. ఈ మధ్యకాలంలో మన దర్శకులందరూ కూడా విలన్ రోల్స్ కోసం పక్క ఇండస్ట్రీల నుంచి నటులను దిగుమతి చేసుకుంటున్నారు. 

 

గోపీచంద్ మలినేని 'క్రాక్' సినిమాలో విలన్స్ కోసం కోలీవుడ్ నుంచి వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖనిలను తీసుకొచ్చారు. ఈసారి కన్నడ ఇండస్ట్రీ నుంచి విలన్ ను తీసుకొస్తున్నారట. ప్రముఖ నటుడు దునియా విజయ్ ను బాలయ్య సినిమాలో విలన్ గా అనుకుంటున్నారట. కన్నడలో విజయ్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన 'దునియా' అనే సినిమాతో పాపులర్ అవ్వడంతో దునియా విజయ్ అనే పేరొచ్చింది. ఇతడైతే బాలయ్యకు ధీటుగా ఉంటాడని.. ఆయన్నే ఫైనల్ చేయాలనుకుంటున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన రానుంది. 

 

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి 'జై బాలయ్య' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని మరో మాస్ హిట్ వస్తుందేమో చూడాలి! 




 


 


 


 


 





ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి