Kangana Ranaut About Ram Lalla Idol: రామ్‌ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకకు అయోధ్య ముస్తాబైంది. ఈ నెల 22న జరుగనున్న ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మంగళవారం నుంచే ఆలయ దగ్గర సంప్రదాయ పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. 22న మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా పలు రాష్ర్టాలకు చెందిన కళాకారులతో సంగీత ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. వేలాది మంది ప్రముఖులు, లక్షలాది మంది భక్తులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఇప్పటికే అయోధ్య ఆలయంలో కొలువుదీరనున్న బాలరాముడి విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి. శ్రీరాముడు చూడముచ్చటగా ఉన్నారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


బాలరాముడి విగ్రహం అద్భుతం అంటూ కంగనా ప్రశంసలు


తాజాగా రామ్ లల్లా విగ్రహంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు భగవంతుడి ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. రాముడి విగ్రహం ఎలా ఉండాలో అచ్చం అలాగే ఉందని చెప్పుకొచ్చారు. “శ్రీరాముడు చిన్న బాలుడిగా ఉంటాడని నేను భావించాను. నా ఊహ ఈ రోజు నిజం అయ్యింది” అని రాసుకొచ్చారు. అటు ఈ విగ్రహాన్ని రూపొందించిన మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ ను ప్రశంసిస్తూ మరో పోస్టు పెట్టారు. “ఇంత మనోహరమైన, మంత్ర మంత్రముగ్ధులను చేసే విగ్రహాన్ని మీరు తయారు చేశారు. ఇది నిజంగా శ్రీరాముడి ఆశీర్వాదం. ఆ భగవంతుడు మిమ్మల్ని దివ్యదృష్టితో ఆశీర్వదించాడు” అని అభినందించారు.   


రామ్ లల్లా విగ్రహాన్ని చెక్కిన అరుణ్‌ యోగిరాజ్‌


కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ అయోధ్య ప్రధాన ఆలయంలో కొలువుదీరే బాల రాముడి విగ్రహాన్ని రూపొందించారు. ఈ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠకు ఎంపిక చేసినట్టు చేసినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌ రాయ్‌ వెల్లడించారు. కృష్ణ శిల మీద చెక్కి ఈ విగ్రహం సుమారు రెండు క్వింటాళ్ల బరువు ఉంటుందని తెలిపారు. బాల రాముడి నేత్రాలు తామర పువ్వు రేకుల మాదిరిగా ఉంటుంటాయని, ఆయన ముఖం చంద్రుడిలా ప్రకాశిస్తుందని ఆయన వెల్లడించారు. పొడవాటి చేతులతో విగ్రహం తయారైందని తెలిపారు.జనవరి 22న అయోధ్యలో జరిగే రామమందిరం ప్రారంభోత్స వేడుకకు రావాల్సిందిగా కంగనా రనౌత్‌కు ఇప్పటికే ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


విడుదలకు రెడీ అవుతున్న ‘ఎమర్జెన్సీ’


గత ఏడాది ఆమె నటించిన ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. ‘తేజస్’, ‘చంద్రముఖి -2’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశ పరిచాయి.  ప్రస్తుతం ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పాత్రలో ఆమె కనిపించబోతోంది. ‘ఎమర్జెన్సీ’ రోజుల నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Read Also: ‘సరిపోదా శనివారం’ తెలుగు రాష్ట్రాల హక్కులు వారికే - అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు!