రోజు తెలుగు సినిమా ఎన్నో ఘనతలు సాధిస్తోంది. ఎస్.ఎస్.రాజమౌళి లాంటి మాస్టర్ మైండ్స్ ప్రతిభ, కృషితో ఆస్కార్ స్థాయికి తెలుగు సినిమా చేరుకుంది. కానీ ఒకానొక దశలో తెలుగు సినిమా మూసధోరణిలో పడిపోయింది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో. ఒకప్పుడు టాలీవుడ్ పరిస్థితి కూడా అంతే. ఏం సినిమాలు తీస్తున్నారో ఎవ్వరికీ తెలీదు. 70ల చివరినాటికి చేరుకునే సరికి పరిస్థితి మరీ దిగజారింది. పాటల్లో ద్వందార్థాలు.. బూతు మాటలు.. డబుల్ మీనింగ్ డైలాగులు పెడితే కానీ సినిమాను ప్రేక్షకుడికి చూపించలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఓ సినిమా విడుదలైంది. అచేతన స్థితిలో సొమ్మసిల్లి పడిపోయిన తెలుగు సినిమాకు ఊపిరి పోసింది. హీరో అంటే ఇలా ఉండాలి. హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. డైరెక్షన్ అంటే ఇలానే చేయాలనే ఆలోచనల నుంచి బయటపడేసిన ఏకైక చిత్రం.. ‘శంకరాభరణం’. ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం నభూతో నభవిష్యతి. ఈ తెలుగు సినిమా ఇంత గర్వంగా నిలబడిందంటే దానికి మళ్లీ తవ్వి వేసిన పునాది ‘శంకరాభరణం’.


హీరో ఓ వృద్ధుడు.. పేరు శంకరశాస్త్రి. విమెన్ లీడ్ క్యారెక్టర్ ఓ దేవదాసీ. ప్లాట్ లైన్ శాస్త్రీయ సంగీత నేపథ్యంలో సినిమా. సాధారణంగా అప్పట్లో  యూత్‌కు కూడా ఇది బోరింగ్ కాన్సెప్ట్. అసలు జేవీ సోమయాజులు అనే స్టేజ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తే జనాలు డబ్బులిచ్చి టిక్కెట్లు కొనుక్కుని థియేటర్లకు వస్తారా? అనే సందేహాలతో ఆ సినిమాను కొనటానికి ఒక్కరూ రాలేదు. అప్పటికే ఇండస్ట్రీలో తనకున్న పలుకుబడితో విశ్వనాథ్ స్పెషల్ షో వేయించినా సినిమా కొనేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపించలేదు. మొత్తాన్నికి.. ఎన్నో ప్రయత్నాల తర్వాత 1980, ఫిబ్రవరి 2న కొన్ని థియేటర్లలో ఈ సినిమాను రీలీజ్ చేశారు. విశ్వనాథ్. మహా అయితే పదుల సంఖ్యలోనే షోలు. ఒక్కవారం ఆడింది. ఆ సినిమా విలువ జనాలకు అర్థమైంది. మౌత్ పబ్లిసిటీతో థియేటర్లు జామ్ ప్యాక్ అయిపోవటం మొదలైంది. దీంతో ‘శంకరాభరణం’ మూవీకి థియేటర్ల సంఖ్య పెంచారు. ఈ మూవీకి వస్తున్న పబ్లిసిటీని చూసి ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్లు తలలు పట్టుకున్నారు. ఏముందీ ఈ సినిమాలో.. అసలు కమర్షియల్ వయబుల్ అయ్యే లైనే కాదు ఈ సినిమా అనుకున్నారు. వారి అనుకున్నది కూడా నిజమే. కానీ, అందులో కంటెంట్ అసలైన మ్యాటర్. అందుకే కలెక్షన్ల వర్షం కురిసింది. సంగీత సరస్వతి ప్రభంజనానికి లక్ష్మీ కటాక్షం తోడైంది. విశ్వనాథుల వారి దర్శకత్వ ప్రతిభ, జేవీ సోమయాజులు, మంజుభార్గవి తదితరుల నటన.. కేవీ మహదేవన్ సంగీతం ఈరోజుకూ మనల్ని తడుతూనే ఉన్నాయి. జీవచ్ఛవంలా మారుతున్న తెలుగు సినిమాకు ఊపిరి పోసిన ఘనత కళాతపస్వి కే విశ్వనాథ్ ది. చిత్రం ఏమిటంటే ఆ మూవీని విడుదల చేసిన ఫిబ్రవరి 2వ తేదీనే విశ్వనాథ్ కన్నుమూశారు. 


అప్పట్లో హైదరాబాద్‌లోని రాయల్ థియేటర్ లో 216 రోజులు లాంగ్ రన్. కేరళ వాళ్లు వచ్చి సినిమాను కొనుక్కెళ్లి డబ్బింగ్ చేయించుకుని తిరువనంతపురంలో కవిత థియేటర్లో ఆడించారు. 200 రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్లు. అదీ కే విశ్వనాథ్ అంటే.. అదీ ఆయన తెలుగు సినిమాకు చేసిన మేలంటే. చెబితే అతిశయోక్తి అనుకుంటారేమో కానీ ఈ రోజు జనాలు కర్ణాటక సంగీతం నేర్చుకుంటున్నారంటే.. దాన్ని వాళ్ల పిల్లలకు నేర్పించటం తమ వారసత్వంగా భావిస్తున్నారంటే.. ‘శంకరణాభరణం’ సినిమా ఓ పెద్ద రీజన్. లేదంటే పాశ్చాత్య సంగీతపు హోరులో ఎప్పుడో మన కల్చర్ తన ట్రెడీషన్స్ కొట్టుకుపోయేవి. అంతటి గొప్ప సినిమా మనకు తెలుగు వారికి కానుకగా ఇచ్చిన మహానుభావుడు మన మధ్యలో లేకపోవచ్చు. కానీ తెలుగు సినిమా ఉన్నంత కాలం ‘శంకరాభరణం’ సినిమాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాం. విశ్వనాథుల వారిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం.


Also Read : చిరంజీవితో విశ్వనాథ్‌కు ప్రత్యేక అనుబంధం - కళా తపస్విని కన్నతండ్రిలా భావించే మెగాస్టార్!