మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని కోరుకునే హీరో హీరోయిన్లు ఎంతో మంది. చిరు కూడా తన ట్రెండ్ మార్చారు. ఇతర హీరోలతో, టాప్ నటులతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆయన ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటిస్తున్నారు. అందులో సత్యదేవ్, సల్మాన్ ఖాన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అలాగే మరో సినిమాలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించబోతున్నట్టు వినిపిస్తోంది. వీరిద్దరూ గతంలో ‘అన్నయ్య’ సినిమాలో అన్నదమ్ములుగా కనిపించారు. అప్పట్లో రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్టుగానే చేస్తున్నారు. కాగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే సినిమాలో చిరంజీవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అతని చెల్లెలిగా కీర్తి సురేష్ కనిపించబోతోంది. ఇదే సినిమాలో హీరో నితిన్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ పాత్ర ఎక్కువ సేపు ఉండదని, అతిధి పాత్ర అని సమాచారం. ముఖ్యంగా కీర్తి సురేష్ కి జోడీగా ఆయన కనిపించే అవకాశం ఉంది. వీరిద్దరూ కలిసి జోడీగా ‘రంగ్ దే’ అనే సినిమాలో నటించారు. నితిన్ నటిస్తున్న సంగతిని ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు. తమిళ సినిమా ‘వేదాళం’కు రీమేక్ ఇది. అక్కడ చిరు పాత్రను అజిత్ చేయగా, అతని చెల్లెలిగా లక్ష్మీ మీనన్, ఆమెకు జోడీగా అశ్విన్ కాకుమాను నటించారు.  


షూటింగ్‌లో బిజీబిజీ...
ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్‌ను దాదాపు పూర్తి చేశారు చిరంజీవి. భోళా శంకర్ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. ఇందులో చిరుకు జంటగా తమన్నా కనిపించనుంది. ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం మధ్యలో జరిగింది. కానీ అవన్నీ పుకార్లేనని చెప్పొకొచ్చింది చిత్రయూనిట్. ఈ ఏడాది చివరికి ఎలాగైనా సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 


ఈ సినిమా కొత్త షెడ్యూల్ జూన్ 21 నుంచి ప్రారంభం కానున్నట్టు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ సినిమాకు సంగీతాన్ని మహతి స్వర్ సాగర్ సమకూర్చారు. అన్నా చెల్లెలి అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. తమిళంలో వేదాళం సూపర్ హిట్ కొట్టింది. దాన్ని ఎప్పట్నించో ఎందరో రీమేక్ చేయాలని ప్రయత్నించారు. కానీ ఆ సినిమా చిరు ఖాతాలో పడింది. ఈ సినిమా షూటింగ్ మధ్యలో నత్తనడకగా సాగింది. దీంతో సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. 


Also Read: వెనక్కి వెళ్ళిన అరుణ్ విజయ్ 'ఏనుగు' - ఎప్పుడు విడుదల అవుతుందంటే?


Also Read: విష్ణు మంచు ఇచ్చిన లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే? ఉదయం ఆరు గంటలకు వర్క్ స్టార్ట్