లావణ్య త్రిపాటి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘హ్యాపీ బర్త్ డే’ సినిమా విడుదలకు సిద్ధమైంది. దీంతో చిత్రయూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే, అన్ని సినిమాల తరహాలో రొటీన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కాదు. ఫేక్ ఈవెంట్. లో-బడ్జెట్ సినిమాకు అంత బడ్జెట్ ఎందుకని అనుకున్నారో ఏమో.. కాస్త క్రియేటివ్‌గా ఆలోచించి.. యాంకర్ సుమతో ఈ కార్యక్రమాన్ని నడిపించేశారు. ఇక సుమ యాంకరింగ్ అంటే.. ఈ ఈవెంట్ ఏ తరహాలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 


ఈ ఈవెంట్‌ను తొలుత జనాల మధ్య నడుపుతున్నట్లుగా చూపించారు. కానీ, జనాల్లేకుండానే ఈ కార్యక్రమాన్ని నడిపించినట్లు చివర్లో చూపించారు. ఇదెలాగో ఫేక్ ఈవెంట్ కాబట్టి.. గెస్ట్‌ను కూడా భారీగా ప్లాన్ చేసుకున్నారు. ఇంతకీ ఎవరా? అనేగా మీ సందేహం. ఆ గెస్ట్ మరెవ్వరో కాదు.. హాలీవుడ్ టాప్ హీరో టామ్ క్రూజ్. అయితే, అతడు తొలుత పారాచూట్‌తో స్కైడైవ్ చేసుకుంటూ వద్దామని టామ్ క్రూజ్ ప్లాన్ చేశాడట. కానీ, పారచూట్‌కు కన్నం పడటం వల్ల సాధ్యం కాలేదట. దీంతో ఏవీతో ‘హ్యాపీ బర్త్ డే’ టీమ్‌ను విష్ చేశాడు. ‘‘నేను ఆ సినిమాను స్పైప్‌లో చూశాను. చాలా బాగుంది. మా ‘టాప్ గన్’, ‘హ్యాపీ బర్త్ డే’ ఒకే సారి రిలీజ్ కావల్సి ఉండేది. కానీ, నా సినిమాకు పోటీ అని వాయిదా వేసుకోవాలని అడిగాను. దీంతో రితేష్ అంగీకరించారు. అందుకే ఇప్పుడు రిలీజ్ అవుతుంది’’ అని టామ్ క్రూజ్ చెప్పినట్లుగా ఈవెంట్‌లో చూపించారు. వాస్తవానికి ఇది కూడా ఫేకే.


Also Read: నరేష్ ఎవరో తెలీదు, ఆ ఆధారం ఒక్కటే లేదు, పవిత్ర నన్ను క్షమించు - భర్త సుచేంద్ర ప్రసాద్


ఇక సుమ ఈవెంట్ మొత్తం నవ్వులు పూయించారు. లావణ్య త్రిపాఠిని స్టేజ్ మీదకు పిలిచి.. పూల బొకేకు బదులుగా వేపాకుల కట్ట ఇచ్చారు. దీంతో లావణ్య.. ‘‘బొకే ఇవ్వడం మానేశారా?’’ అని అడుగుతుంది. దీనికి సుమ తనదైన శైలిలో స్పందిస్తూ.. ‘‘బొకే ఇద్దామనే అనుకున్నాం. కానీ ‘లైగర్’ తీసుకెళ్లిపోయాడు. కానీ, మళ్లీ దాన్ని తీసుకోలేను’’ అని పంచ్ వేశారు సుమ.


Also Read: థోర్ లవ్ అండ్ థండర్ రివ్యూ: ఉరుముల దొర ఆకట్టుకున్నాడా?


‘మత్తు వదలరా’ సినిమాతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న దర్శకుడు రితేష్ రాణా రూపొందించిన రెండో సినిమా ఇది. నరేష్ అగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. జూలై 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ అందరినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఫుల్ కామెడీ సీన్స్‌తో సినిమా కడుపుబ్బా నవ్వించేలా ఉంది. ముఖ్యంగా ‘మత్తు వదలరా’ సినిమాలోని రత్నా సీరియల్ ఎపిసోడ్‌ను ఇందులో కూడా కొనసాగిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు కాలభైరవ  సంగీతం అందించాడు.