సరికొత్త కాన్సెప్ట్స్ తో, విజువల్స్ తో వండర్స్ చేస్తూ, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హనుమాన్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం ఏకంగా 11 భాషల్లో విడుదలకానుంది. ఆయన పుట్టిన రోజు(మే 29) సందర్భంగా ‘హనుమాన్’ ప్రాజెక్టుతో పాటు తన డ్రీమ్ మూవీస్ గురించి కీలక విషయాలు వెల్లడించారు.  


ఇప్పటికే ‘హనుమాన్’ సినిమా షూటింగ్‌ కంప్లీట్ అయిపోయినట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రస్తుతం వీఎఫ్‌ఎక్స్‌ పనులు జరుగుతున్నాయన్నారు. జూన్‌ చివరకు అన్ని పనులు పూర్తవుతాయని వెల్లడించారు. మూవీ టీజర్‌కు అద్భుత స్పందన వచ్చిందన్న ఆయన, అంతకంటూ మెరుగ్గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి ఈ సినిమా తొలుత తెలుగులో మాత్రమే తీయాలనుకున్నట్లు చెప్పారు. టీజర్ రిలీజ్ అయిన తర్వాత హిందీలోనూ విడుదల చేయాలి అనుకున్నట్లు వివరించారు. కానీ, తమిళం, కన్నడ భాషల్లో వచ్చిన స్పందన చూసి, అక్కడ కూడా రిలీజ్ చేయాలని భావించినట్లు చెప్పారు. వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్స్‌ కోసం చాలా సమయం పడుతుందన్న ఆయన, టైం తీసుకుని చేస్తే ప్రతి సీన్ అద్భుతంగా వస్తుందన్నారు.  


‘హనుమాన్’ కథ ఏంటంటే?


హనుమంతుడి జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా కథను రాసినట్లు ప్రశాంత్‌ వర్మ తెలిపారు. చాలా మంది హనుమంతుడిని చూడాలని కలలుకంటారని, వారికి ఈ సినిమాలో హనుమాన్ ను చూపించబోతున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రంలోని హనుమాన్ పాత్ర కోసం ఏడాది పని చేసినట్లు చెప్పారు. ఆ పాత్ర అద్భుతంగా వచ్చినట్లు చెప్పారు.  


‘ఆదిపురుష్‌’ ప్రభావం ‘హనుమాన్’ మీద ఉండదు


తాము ‘హనుమాన్’ సినిమా మొదలుపెట్టినప్పుడు ‘ఆదిపురుష్‌’ సినిమా లేదని చెప్పారు ప్రశాంత్ వర్మ.  ఒక సినిమా ప్రభావం మరోదానిపై పడుతుందని తాను అనుకోనని చెప్పారు. తమ  సినిమా కోసం బాగా కష్టపడుతున్నామని, అంతే మంచి రిజల్ట్ వస్తుందని నమ్ముతున్నామని వెల్లడించారు.    


తేజ సజ్జను హీరోగా ఎందుకు తీసుకున్నామంటే?


ఒక సాధారణ హీరోకు పవర్స్‌ వచ్చి అందరినీ కొడుతుంటే చూడడానికి చాలా బాగుంటుందని ప్రశాంత్ వర్మ చెప్పారు. అదే స్టార్ హీరోకు పవర్స్ వచ్చినా పెద్దగా ఆసక్తి అనిపించదన్నారు. ‘జాంబీరెడ్డి’ చిత్రంతో యువతకు దగ్గరైన తేజను ఈ సినిమాకు ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ సినిమాకు ఆయన నూటికి నూరుపాళ్లు న్యాయం చేసినట్లు చెప్పారు.  అంతేకాదు, తేజతో కలిసి మరో సినిమా చేయనున్నట్లు చెప్పారు. హనుమాన్‌ తర్వాత ‘అధీర’ చేయనున్నట్లు తెలిపారు.  ప్రస్తుతం 10 స్క్రిప్ట్స్‌ మీద వర్క్‌ చేస్తున్నట్లు చెప్పారు. ‘జాంబీరెడ్డి2’ లాంటి సినిమాలు లైనప్ లో ఉన్నట్లు వివరించారు. అంతేకాదు, ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ పేరుతో ఒక స్టూడియోను నిర్మించనున్నట్లు తెలిపారు. వచ్చే కొద్ది సంవత్సరాల్లో 8 మంది సూపర్‌ హీరోస్‌ సినిమాలు తీయనున్నట్లు ప్రకటించారు. రానున్న రోజుల్లో మన సూపర్‌ హీరోస్‌ సినిమాలు వస్తున్నాయంటే  ‘స్పైడర్ మ్యాన్’ లాంటి సినిమాలు కూడా ఆగిపోయేలా ఉండాలన్నారు.






Read Also: అఖిల్‌‌కు బదులు నిఖిల్ - చెర్రీపై అక్కినేని ఫ్యాన్స్ అలక, మెగా ఫ్యాన్స్‌కూ మింగుడు పడని ఆ నిర్ణయం!