‘పుష్ప’ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రంతో వచ్చిన పాపులారిటీతో అరువైన అవార్డులను అందుకుంటున్నాడు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా దుమ్మురేపిన ఆయనకు.. మరో ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. GQ మ్యాగజైన్ ఇచ్చే ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నాడు. 2022 ఏడాదికి గాను ఆయన ఈ అవార్డును తీసుకున్నారు. రాజకీయాలు, ఫ్యాషన్, కల్చర్ కు సంబంధించిన విభాగాల్లో అద్భుతంగా రాణించిన వారికి ఈ అవార్డును అందజేస్తారు. తనకు ఈ అవార్డు వచ్చిన విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించాడు. సోషల్ మీడియాలో అవార్డు తీసుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు.






GQ అవార్డు అందుకున్న టాలీవుడ్ తొలి నటుడు


తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్న తొలి నటుడిగా అల్లు అర్జున్ ఘనత సాధించాడు. తనకు అరుదైన గుర్తింపు, గౌరవాన్ని అందించిన GQ మ్యాగజైన్ కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు చెప్పాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసిన GQ జ్యూరీ మెంబర్స్ కు ధన్యవాదాలు తెలిపాడు. ఈ ఏడాది తన లిస్టులో ఎన్నో అచీవ్‌మెంట్స్ రాసి పెట్టుకున్నానని.. వాటిలో తొలి అచీవ్మెంట్ కంప్లీట్ చేసినట్లు బన్నీ తెలిపాడు. 


‘పుష్ప’కు అవార్డుల పంట


అల్లు అర్జున్ ఈ అవార్డు అందుకోవడం పట్ల ఆయన అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ‘పుష్ప’ సినిమాలో నటనకు ఇలాంటి అవార్డులు ఇంకా ఎన్నో రావాలని ఆశిస్తున్నారు. తప్పకుండా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ‘పుష్ప’ సినిమాకు సైమా అవార్డుల పంట పండింది. ఈ సినిమాకు పలు విభాగాల్లో అవార్డులు దక్కాయి. ఫిలిమ్ ఫేర్ అవార్డులను కూడా ‘పుష్ప’ మూవీ కొల్లగొట్టింది.  దర్శకుడు సుకుమార్ తెరెక్కించిన ‘పుష్ప’ సినిమా అల్లు అర్జున్ సినీ కెరీర్ లో కనీవినీ ఎరుగని రీతిలో విజయాన్ని అందుకుంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా విడుదల అయిన అన్ని చోట్ల ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. కలెక్షన్ల వరద పారించింది. తాజాగా రష్యాలో ఈ సినిమా విడుదలైంది. అక్కడ కూడా సంచలన విజయాన్ని అందుకుంది.


ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘పుష్ప-2’


‘పుష్ప’ తొలి పార్ట్ మంచి విజయాన్ని దక్కించుకోవడంతో రెండో భాగంపై సుకుమార్ ఫుల్ ఫోకస్ పెట్టారు. అంచనాలకు మించి ఉండేలా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ‘పుష్ప: ది రూల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచస్థాయి టెక్నాలజీతో రూపొందిస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాను సుమారుగా 20కి పైగా దేశాల్లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న కంటిన్యూ అవుతోంది. ఈ పార్టులో తనను మరింత బాగా చూపించబోతున్నారట. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలు కాగా, కీలక సన్నివేశాల షూటింగ్ కొనసాగుతోందట.


Read Also: అదరగొడుతున్న RRR - ప్రతిష్టాత్మక ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?