పాన్ ఇండియా హీరో ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన లేటెస్ట్ మైథాలజికల్ ఫిల్మ్ 'ఆదిపురుష్' కోసం ఫాన్స్ తో పాటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో జోరు మీద ఉన్న ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు భారీ ధరకు కొనుగోలు చేసి విడుదల చేస్తున్నారు. నిజానికి మొదట UV క్రియేషన్స్ నిర్మాతలు 'ఆదిపురుష్' మూవీని తెలుగులో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఏమైందో తెలియదు ఆ తర్వాత వారి స్థానంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ హోల్ సేల్ రేట్ కి కొనుగోలు చేసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు. సుమారు రూ.185 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని పీపుల్స్ మీడియా 'ఆదిపురుష్' మూవీ కోసం ఖర్చు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ క్రమంలోనే ఈ మూవీ తెలుగు రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అమ్మేందుకు పీపుల్స్ మీడియా నిర్మాతలు తీవ్రంగా ప్రయత్నించారట. కానీ దిల్ రాజు మాత్రం పెద్దగా ఆసక్తి చూపించలేదని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అందుకు కారణం ఆదిపురుష్ మూవీకి పీపుల్స్ మీడియా నిర్మాతలు భారీ ధరను డిమాండ్ చేయడమే అని అంటున్నారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం పీపుల్స్ మీడియా నిర్మాతలు ఆదిపురుష్ మూవీ నైజాం రైట్స్ రూ.60 కోట్లకి, అలాగే ఉత్తరాంధ్ర రైట్స్ రూ.22 కోట్లకి అమ్మేందుకు రెడీ అయ్యారట. సాధారణంగా అగ్ర హీరోల సినిమాలకి డిస్ట్రిబ్యూటర్లు ఈ రేంజ్ లో డిమాండ్ చేయడం కామనే. కానీ దిల్ రాజు మాత్రం ఎందుకనో ఆదిపరుష్ నైజాం, ఉత్తరాంధ్ర రైట్స్ ని కొనేందుకు మాత్రం ఆసక్తి కనబరచలేదు. అయితే నిర్మాతలు భారీగా డిమాండ్ చేయడంతోనే దిల్ రాజు పెద్దగా ఆసక్తి చూపించలేదని ఒకవైపు వార్తలు వినిపిస్తుండగా.. మరోవైపు ఆదిపురుష్ మూవీ పట్ల దిల్ రాజుకి పెద్దగా నమ్మకం లేదనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. అలాగే ఇటీవల ‘శాకుంతలం’ మూవీ ఫ్లాప్ ప్రభావం కూడా దిల్ రాజు ఈ నిర్ణయం తీసుకోడాని కారణం కావచ్చని సమాచారం.


మరి దిల్ రాజు ఆదిపురుష్ విషయంలో కావాలనే ఇలా చేశాడా? లేక గతంలో పలు పెద్ద సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసి నష్టాలు అందుకున్న కారణంగా మరోసారి రిస్క్ ఎందుకు అనుకున్నాడా? అనేది తెలీదు కానీ ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్ లో దీని గురించే చర్చలు జరుగుతున్నాయి. కాగాలో ఆదిపురుష్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు మేకర్స్. ఇక ఈవెంట్ కోసం నిర్మాతలు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట. అంతేకాదు ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా శ్రీ చిన్న జీయర్ స్వామి హాజరు కాబోతుండడం విశేషం. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మరో స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే ఈ ఈవెంట్ లోనే ఆదిపురుష్ నుంచి మరో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ లో అంచనాలు పెంచగా.. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విడుదలయ్యే మరో ట్రైలర్ ఆ అంచనాలను తారస్థాయికి చేర్చడం ఖాయమని చెప్పొచ్చు.


Read Also: పచ్చి బూతులు, పారుతున్న నెత్తురు, జుగుప్సాకరంగా ‘సైతాన్’ ట్రైలర్’ - పెద్దలకు మాత్రమే!