రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలో పేరెంట్స్ కాబోతున్న సంగతి తెలిసిందే. పెళ్లైన పదేళ్ల తర్వాత తమ కుటుంబంలోకి మనువడు రాబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. మెగా అభిమానులతో పాటు సినీ స్టార్స్ చెర్రీ దంపతులకు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా తనకు పుట్టబోయే బిడ్డ గురించి తొలిసారి రియాక్ట్ అయ్యింది ఉపాసన. అమెరికాలో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో చెర్రీ సహా ‘RRR’ టీమ్ తో కలిసి పాల్గొన్న ఆమె, సంతోషకరమైన విషయాన్ని వెల్లడించింది.

   


నా కడుపులోని బిడ్డ కూడా అనుభూతి పొందుతోంది- ఉపాసన


“RRR టీమ్ లో నేనూ ఓ భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ’RRR‘ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం దేశం గర్వించదగిన విషయం. ఈ అవార్డు వేడుకల్లో నాతో పాటు నా కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభూతి పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు ఎంతో మధురంగా, భావోద్వేగంగా ఉంది” అంటూ రాసుకొచ్చింది.






‘నాటు.. నాటు’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు


తాజాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదాన వేడుక అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో అట్టహాసంగా జరిగింది. ‘RRR’ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్, విదేశీ ఉత్తమ చిత్రం విభాగాల్లో నామినేట్ అయ్యింది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ‘నాటు నాటు’ అనే పాట బెట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డును దక్కించుకుంది. ఈ కేటగిరీలో అవార్డు అందుకున్న తొలి భారతీయ సినిమాగా ‘RRR’ రికార్డు సృష్టించింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు.






ఈ సందర్భంగా ప్రధాని మోడీ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ‘RRR’ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఆస్కార్ అవార్డుల్లోనూ ‘RRR’ సత్తా చాటాలని ఆకాంక్షించారు.


Read Also: ‘RRR’ సీక్వెల్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు, కీలక విషయాలు వెల్లడి!