సౌత్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’. మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. వసూళ్ల పరంగానూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఈ చిత్రం భారత్ లో రూ. 16 కోట్లు షేర్ వసూళు చేయగా, ప్రపంచ వ్యాప్తంగా రూ. 29 కోట్ల కలెక్షన్లు అందుకుంది.


‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ మేకర్స్ అదిరిపోయే ఆఫర్


తాజాగా ఈ చిత్రబృందం ఆడియెన్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. గురువారం(సెప్టెంబర్ 14)నాడు ఈ సినిమా చూసిన ప్రేక్షకులకు అనుష్కతో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం ప్రేక్షకులు ఏం చేయాలో చెప్పారు. “మీ ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ టికెట్ పైన మీ ఫోన్ నెంబర్ రాసి థియేటర్ స్క్రీన్ బయట ఏర్పాటు చేసిన బాక్సులో వేయండి. ప్రతి థియేటర్ నుంచి సెలెక్ట్ చేయబడిన ఇద్దరు లక్కీ లేడీస్ మా ‘లేడీ లక్’ అనుష్క గారికి స్వయంగా ఫోన్ చేసి మాట్లాడే అవకాశం పొందుతారు” అని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ ఆఫర్ కేవలం ఒకే రోజు(సెప్టెంబర్ 14) మాత్రమే ఉంటుందని చెప్పారు. అంతేకాదు, కేవలం మహిళలకు మాత్రమే ఈ అకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.


ప్రశంసలు కురిపించిన పలువురు ప్రముఖులు


‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ మూవీ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కింది.  వంశీ, ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు తొలి షో నుంచే అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. ఈ సినిమాలో నవీన్ నటనను అందరూ మెచ్చుకున్నారు.  అనుష్కతో పోల్చితే నవీన్ నటనే అద్భుతంగా అలరించిందని టాక్ వచ్చింది.  'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'జాతి రత్నాలు' తర్వాత నవీన్ పోలిశెట్టి ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడు. ఇక  అనుష్క కెరీర్ లో 48వ చిత్రంగా ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ వచ్చింది.  'నిశ్శబ్దం' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఆమె ఈ సినిమాలో నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది.  సీనియర్ హీరోయిన్ - యంగ్ హీరో కలిసి నటించిన ఈ చిత్రం  చక్కటి  విజయాన్ని అందుకుంది. ‘Miss. శెట్టి Mr. పొలిశెట్టి’ చిత్రంపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి, అందాల నటి సమంత మెచ్చుకున్నారు. మూవీ టీమ్ ను  అభినందిస్తూసోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఇక ఈ చిత్రంలో జయసుధ, నాజర్, మురళీ శర్మ, తులసి, సోనియా దీప్తి, అభినవ్ గోమటం తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ సినిమాకి రధన్ సంగీతం అందించారు.


Read Also: రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చిన బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? ఆయన పద్మశ్రీ పురస్కార గ్రహీత కూడా!



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial