టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ హాస్య నటుడు కడలి జయ సారథి(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని సిటీ న్యూరో హాస్పిటల్‌లో నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు తుది శ్వాస విడిచారు. జయసారధి మరణానికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. 


సారథి దాదాపు 372 చిత్రాల్లో నటించి మెప్పించారు. 1961లో వచ్చిన 'సీతారామ కళ్యాణం' సినిమాతో సారథి కెరీర్‌ని ప్రారంభించారు. నందమూరి తారక రామారావు ఈ సినిమాలో హీరో. ఆ సినిమా హిట్ అవ్వడంతో తన కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 1976లో వచ్చిన 'భక్త కన్నప్ప', 1978 లో వచ్చిన 'జగన్మోహిని' చిత్రాలు ఆయనకి విశేషమైన కీర్తిని ఇచ్చాయి. జగన్మోహిని సినిమాలో దెయ్యంతో కలిసి ఆయన చేసిన కామెడీ కడుపుబ్బా నవ్విస్తుంది.


తెలుగు సినిమా ఇండస్ట్రి మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చేందుకు ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేశారు. సారథి ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) వ్యవస్థాపక సభ్యులుగా వ్యవహరించారు. 1942 జూన్ 26 న ఆంధ్రప్రదేశ్‌లోని పెనుగొండలో జన్మించారు. అల్లు రామలింగయ్య, రేలంగి, రాజబాబు వంటి హాస్య నటులతో పాటు తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. 'భలే రంగడు', 'అగ్గి వీరుడు', 'మంచి మనసులు', 'భక్త కన్నప్ప', 'ఎదురీత', 'అమర దీపం', 'ఆలుమగలు', 'జగన్మోహిని', 'మనవూరి పాండవులు', 'డ్రైవర్ రాముడు' వంటి హిట్ సినిమాల్లో ఆయన నటించారు. 90వ దశకంలో ఆయన నటనకి స్వస్తి పలికి కృష్ణం రాజుతో కలిసి ఇంటింటి రామాయణం, జమిందారిగారి అమ్మాయి వంటి సినిమాలకు సాంకేతిక సహకారాలు అందించారు. రెబల్ స్టార్ కృష్ణం రాజుతో ఆయనకి ప్రత్యేక అనుబంధం ఉంది. ధర్మాత్ముడు, అగ్గిరాజు, విధాత వంటి సినిమాలకు ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. చివరిగా సుమన్ హీరోగా నటించిన 'హలో అల్లుడు' సినిమాలో డాక్టర్ పాత్ర పోషించారు. జయ సారథి అంత్యక్రియలు మధ్యాహ్నం 2 గంటలకి మహాప్రస్థానంలో జరగనున్నాయి. 



Also Read: బుల్లితెర హీరోను కొట్టిన సిబ్బంది, సీరియల్ షూటింగ్‌లో షాకింగ్ ఘటన, వీడియో వైరల్


Also Read: సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్- భద్రత పెంచిన ముంబయి పోలీసులు