శ్రీనువైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, సమంత జంటగా నటించిన ‘దూకుడు’ సినిమా ఎంత హిట్ సాధించిందో తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే.. అంతా టీవీలకు అతుక్కుపోతారు. ఆధ్యాంతం ఆకట్టుకొనే ఈ సినిమా ఓ ట్రెండ్ సృష్టించిందని చెప్పుకోవచ్చు. 2011, సెప్టెంబరు 23న విడుదలైన ఈ చిత్రం బుధవారానికి పదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అనిల్ సుంకర ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. ‘దూకుడు’ టైటిల్‌‌తో ప్రత్యేకంగా ఒక లాకెట్ తయారు చేసి మరీ శ్రీనువైట్లకు కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని శ్రీనువైట్ల ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 


‘‘మీరు పంపిన అద్భుతమైన బహుమతి నాకు అందింది అనిల్ సుంకర. మీ హృదయం తరహాలోనే ఇది కూడా బంగారం’’ అని శ్రీనువైట్ల ఆ లాకెట్ ఫొటోను ట్వీట్ చేశారు. 2006లో విడుదలైన ‘పోకిరి’ సినిమా తర్వాత.. మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబుకు ‘దూకుడు’ ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఘట్టమనేని అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.






2003లో విడుదలైన జర్మన్ మూవీ ‘గుడ్ బై, లెనిన్’ ఆధారంగా ‘దూకుడు’ చిత్రం తెరకెక్కింది. అందులో భర్త వెస్ట్ జర్మనీకి వెళ్ళగా, ఈస్ట్ జర్మనీలోనే తన పిల్లలతో ఉంటూ క్రిస్టెనా అనే తల్లి సోషలిస్ట్ యూనిటీ పార్టీ ప్రచారంలో పాలు పంచుకుంటూ ఉంటుంది. ఆమె తనయుడు అలెక్స్ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతాడు. దీంతో పోలీసులు అతణ్ణి అరెస్ట్ చేస్తారు. అరెస్టయిన తనయుణ్ణి చూసి ఆ తల్లి తట్టుకోలేదు. గుండెపోటుకు గురై కోమాలోకి పోతుంది. ఆమె కోమాలో ఉండగా బెర్లిన్ గోడ కూలిపోయి, ఈస్ట్, వెస్ట్ జర్మనీలు కలసి పోతాయి. కొన్నాళ్ళకు కోమా నుంచి అలెక్స్ తల్లి కోలుకుంటుంది. ఆమెకు షాక్ కలిగించే విషయాలు చెబితే చాలా ప్రమాదం అని చెబుతారు డాక్టర్లు. దీంతో ఆమె సంతోషం కోసం అలెక్స్ ఈస్ట్ జర్మనీ అంతకు ముందు ఎలా ఉందో అలా చూపించడానికి పలు పాట్లు పడతాడు. వెస్ట్‌కు వెళ్ళి మరో పెళ్లి చేసుకున్న అలెక్స్ తండ్రి కొడుకు కోరిక మేరకు తిరిగొచ్చేలోగా జర్మనీ రాజకీయ పరిణామాలు తెలుసుకున్న క్రిస్టెనా కన్ను మూస్తుంది. ఇది విషాదంతో ముగిస్తే దీనికి మెరుగులు దిద్దిన దర్శకుడు సుఖాంతం చేశాడు. 


ఆద్యంతం నవ్వులు పూయించిన ‘దూకుడు’ యాభైకి పైగా కేంద్రాల్లో శతదినోత్సవాలు జరుపుకుంది.  విదేశాలలోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది.  అంతకు ముందు ‘మగధీర’, ‘సింహా’ నెలకొల్పిన ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను ఈ సినిమా అధిగమించింది. ఆ రోజుల్లో 57 కోట్ల రూపాయలు వసూలు చేసిన చిత్రంగా ‘దూకుడు’ నిలిచింది. బెంగాలీలో ‘ఛాలెంజ్-2’గానూ, కన్నడలో ‘పవర్’గానూ రీమేక్ అయి సక్సెస్ అయింది. ఆ ఏడాదికి  ఏడు నంది అవార్డులు అందుకోవడం విశేషం. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 23న రాత్రి 9 గంటలకు హైదరాబాద్ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో స్పెషల్ షో ప్రదర్శించనున్నారు.