రాజ్‌ తరుణ్‌ కథానాయకుడిగా ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘తిరగబడరా సామీ’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరోయిన్ మన్నారా చోప్రాకు డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ ముద్దు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. చిత్రబృందం ఫొటోకు ఫోజులు ఇస్తున్న సమయంలో, అందరూ చూస్తుండగానే హీరోయిన్​కు దర్శకుడు ముద్దు పెట్టాడు. దర్శకుడు చేసిన పనికి మన్నారా షాక్ అయ్యింది. చాలా ఇబ్బంది అనిపించినా, మనసులో దాచుకుని నవ్వుతూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. సినిమా పరిశ్రమలో ఇవన్నీ కామన్ అని కొందరు అంటే,  దర్శకుడికి ఇదేం పోయేకాలం? అని మరికొంత మంది మండిపడ్డారు.  హీరోయిన్ తో దర్శకులకు చనువు ఉండటం కామన్. అయినా, ఇలా మీడియా ముందు, అందరూ చూస్తుండగా ఇదేం చెత్త పని అంటూ నిప్పులు చెరిగారు.  దర్శకుడు హుందాగా వ్యహరించాలే తప్ప, చిల్లర చేష్టలు చేయకూడదన్నారు.  


ముద్దు వ్యవహారంపై స్పందించిన రవి కుమార్


తాజాగా ఈ ఘటనపై దర్శకుడు ఏఎస్ రవి కుమార్ చౌదరి స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు. మన్నారాపై ప్రేమానురాగాలతో ముద్దుపెట్టుకున్నానని చెప్పారు. అంతేతప్ప చెడు ఉద్దేశంతో తాను ఆ పని చేయలేదన్నారు. “హీరోయిన్ మన్నారపై ప్రేమ, అనురాగంతోనే ముద్దు పెట్టుకున్నాను. ఆమెను   ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. ముద్దు వ్యవహారంలో నటి మన్నారా చోప్రాకే సమస్య లేనప్పుడు, జనాలు ఎందుకు అతిగా స్పందిస్తున్నారో అర్థం కావడం లేదు. నా కూతురిని కూడా ఇలాగే ముద్దుపెట్టుకుంటాను. ఇందులో నాకు ఏమీ తప్పు అనిపించలేదు. ఇప్పటికైనా ఈ వివాదం గురించి మాట్లాడ్డం మానేస్తే బాగుంటుంది” అని రవి కుమార్ తెలిపారు.






సినిమాపై అంచనాలు పెంచిన టీజర్


ఇక బాలకృష్ణతో 'వీరభద్ర', గోపీచంద్‌తో 'యజ్ఞం', సాయిధరమ్ తేజ్‌తో 'పిల్లా నువ్వు లేని జీవితం' లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ఏఎస్ రవికుమార్. ప్రస్తుతం రాజ్ తరుణ్ హీరోగా 'తిరగబడరా సామీ' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపిస్తోంది. మేకర్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అందమైన ప్రేమకథ, ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఫన్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. చలాకీ కుర్రాడు రాజ్ తరుణ్ పిరికివాడికి కనిపించడం ఆసక్తికరంగా ఉంది. అతని లవర్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది.  మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో నటించారు.  మన్నార్ చోప్రా కీలక పాత్ర పోషించింది. లేటెస్ట్ టీజర్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెరిగాయి. చాలా కాలంగా వెండితెరకు దూరంగా ఉన్న రాజ్ తరుణ్ ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాలని భావిస్తున్నాడు.


Read Also: షారుఖ్‌తో ప్రేమలో ఉన్న అమ్మాయిపై పగ తీర్చుకున్నా- విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial