I.N.D.I.A కూటమి సమావేశాల్లో పాల్గొనేందుకు ముంబైకి వచ్చిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. బిగ్ బీ కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా బిగ్ బీకి దీదీ రాఖీ కట్టారు. అనంతరం అమితాబ్ కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటించారు. ఈ వేడుకల్లో బిగ్ బీ సతీమణి జయా బచ్చన్, కొడుకు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యారాయ్, మనువరాళ్లు ఆరాధ్య బచ్చన్, శ్వేతానంద, నవ్య నవేలి నంద పాల్గొన్నారు.


బిగ్ బీ ఫ్యామిలీతో రాఖీ వేడుకలు జరపుకోవడం సంతోషంగా ఉంది- మమతా


 ఆ తర్వాత అమితాబ్ ఫ్యామిలీతో కలిసి మమతా మీడియాతో మాట్లాడారు. బిగ్ బీ కుటుంబతో కలిసి రాఖీ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. “ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. నేను భారతరత్నగా భావించే అమితాబ్ కు రాఖీ కట్టాను. అమితాబ్ కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. గౌరవం కూడా. వారిది దేశంలోనే నెంబర్ వన్ కుటుంబం. సినీ రంగం కోసం వారు ఎంతో కృషి చేశారు. బెంగాల్ లో జరిగే దుర్గాపూజ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు రావాల్సిందిగా నేను అమితాబ్ ను ఆహ్వానించాను” అని మమతా వెల్లడించారు.  


తృణమూల్ కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా వెల్లడి


మమతా బెనర్జీ, బిగ్ బీ కుటుంబ సభ్యులు సమావేశానికి సంబంధించిన విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా వేదికగా వెల్లడించింది. బిగ్ బీ కుటుంబ సభ్యులతో కలిసి మమతా బెనర్జీ రాఖీ పండుగ జరుపుకున్న ఫోటోలను షేర్ చేసింది. భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది. “ఇవాళ జయా బచ్చన్‌  కుటుంబాన్ని ముంబైలోని వారి నివాసంలో సీఎం మమతా బెనర్జీ కలిశారు.  అమితాబ్ బచ్చన్ కుటుంబం తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆమె వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు.” అని ట్వీట్ చేసింది.










బిగ్ బీ ఫ్యామిలీతో మమతకు స్నేహపూర్వక సంబంధాలు


నటుడు అమితాబ్ బచ్చన్, ఆయన భార్య ఎంపీ జయ బచ్చన్‌తో మమతా బెనర్జీకి మంచి సంబంధాలున్నాయి. గత ఏడాది, అమితాబ్ బచ్చన్ కలకత్తా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో మమతా బెనర్జీ భారతీయ సినిమా పరిశ్రమకు బిగ్ బీ చేసిన విశిష్ట సేవలపై అభినందనలు కురిపించారు. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ పాపులర్ టీవీ  రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌ లో పాల్గొంటున్నారు. అటు ఆగష్టు 31, సెప్టెంబర్ 1న ముంబైలో ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా ఉన్న పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొంటున్నారు.  


Read Also: షారుఖ్‌తో ప్రేమలో ఉన్న అమ్మాయిపై పగ తీర్చుకున్నా- విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial