Dil Raju New Hindi Movie: ‘OMG 2’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకున్న దర్శకుడు అమిత్ రాయ్ బాలీవుడ్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారు. వకావో బ్యానర్ లో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో అశ్విన్ వార్దే నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఈ సినిమాలో  శివాజీ పాత్రకు షాహిద్ ఫర్ఫెక్ట్ గా సూటవుతారని దర్శకుడు భావిస్తున్నారట. ఈ సినిమా కోసం పలువురు నటులను స్క్రీన్ టెస్ట్ చేసినప్పటికీ, ఫైనల్ గా షాహిద్ కు ఓకే చెప్పారట.  


వకావో సంస్థతో జతకడుతున్న దిల్ రాజు


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొక్షన్ పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  ఈ చిత్రానికి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. టాలీవుడ్ ఏస్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం కాబోతున్నారట. వకావో ఫిల్మ్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారట. “షాహిద్ కపూర్‌ హీరోగా బాలీవుడ్ లో ఓ ప్రతిష్టాత్మ చిత్రం తెరకెక్కబోతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరాక్రమాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు. వకావో ఫిల్మ్స్, అమిత్ రాయ్ తో కలిసి దిల్ రాజు ఈ సినిమాలో భాగస్వామ్యం అవుతున్నారు” అని బాలీవుడ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.  


అటు ఈ సినిమా కోసం దిల్ రాజు కూడా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. షాహిద్ కపూర్ ను మరాఠా యోధుడిగా చూడాలని ఉత్సాహపడుతున్నారట. “అమిత్ రాయ్ కొంతకాలంగా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. ఈ సినిమా అతడి డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఈ సినిమా కథకు సంబంధించిన పరిశోధన కొనసాగుతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది” అని బాలీవుడ్ లో టాక్ నడుస్తోంది.


శివాజీ జీవితంలోని కీలక ఘటన ఆధారంగా తెరకెక్కనున్న సినిమా


ఇక ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు భాగస్వామ్యం కావడంతో పాన్ ఇండియా రేంజిలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా శివాజీ జీవిత చరిత్రలోని ఒక అధ్యాయం ఆధారంగా రూపొందబోతోంది. అతడి జీవిత కథను పూర్తిగా 3 గంటలలో చెప్పడం సాధ్యం కాదని, అందుకే ఓ కీలక ఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు కొద్ది రోజుల క్రితం అమిత్ రాయ్ తన మిత్రులు దగ్గరి చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం షాహిద్ కపూర్ ‘దేవా’ అనే సినిమా చేస్తున్నారు. సూరజ్ బర్జాత్యాతో కలిసి ‘ప్రేమ్ వివాహ్’ అనే సినిమా చేయబోతున్నారు.  దిల్ రాజు ప్రస్తుతం తెలుగులో పలు సినిమాలు నిర్మిస్తున్నారు.


Read Also: ‘ఎర్త్ అవర్’ రోజు లైట్లు ఎందుకు ఆర్పేయాలి? హైదరాబాద్‌లో ఈ టైమ్‌లో లైట్స్ అన్నీ బంద్!