Moscow Concert Hall Attack News: రష్యాలోని మాస్కోలో కాన్సర్ట్ హాల్‌లో జరిగిన ఉగ్రదాడి అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. మిలిటరీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే..ఈ దాడి చేసింది తామేనని ISIS-K ప్రకటించడమే మరింత అలజడి పెంచింది. అఫ్గనిస్థాన్‌లోని ఐసిస్‌కి అనుబంధ సంస్థే ఈ ఐసిస్‌-కే. సిరియా, ఇరాక్‌ నుంచి ఈ గ్రూప్‌ని ఆపరేట్ చేస్తున్నారు. అమెరికాతో పాటు సౌత్, సెంట్రల్ ఏసియా దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుంటుంది ఈ ఉగ్రసంస్థ. అఫ్గాన్‌లోని ఐసిస్ బ్రాంచ్‌నే ఐసిస్‌-కే గా పిలుస్తారు. ఇరాన్, తుర్క్‌మెనిస్థాన్, అఫ్గనిస్థాన్ ప్రాంతాన్ని కలిపి ఒకప్పుడు Khorasan గా పిలిచేవాళ్లు. అదే పేరుతో ప్రత్యేకంగా ఇక్కడ యూనిట్‌ని ఏర్పాటు చేసుకుంది ఐసిస్.


తూర్పు అఫ్గనిస్థాన్‌లో 2014లో మొదలై నరమేధం సృష్టిస్తోంది. పాకిస్థాన్, అఫ్గనిస్థాన్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలకు ప్లాన్ చేసుకుంటోంది. 2015 లో ఐసిస్‌ డామినేషన్ విపరీతంగా ఉండేది. ఆ సమయంలోనే అఫ్గనిస్థాన్, పాకిస్థాన్ నుంచి ISIS-K పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంది. ఐసిస్ సిద్ధాంతాల్ని తు.చ. తప్పకుండా పాటించడమే కాకుండా...అంత కన్నా దారుణంగా తయారైందీ సంస్థ. అఫ్గనిస్థాన్‌లో నెట్‌వర్క్‌ని పెంచుకుంది. 2019లో తమకు ప్రత్యేక పాకిస్థాన్‌ ఉందని ప్రకటించుకుంది. వాళ్ల ఆధిపత్యం ఉన్న ప్రాంతాన్ని పూర్తిగా తమకే సొంతం అని తేల్చి చెప్పింది. మొత్తం 3 వేల మంది సైన్యాన్ని తయారు చేసుకుంది. అటు అమెరికాతో పాటు అఫ్గాన్ మిలిటరీ బలగాల దాడుల్ని తట్టుకుని నిలబడగలిగింది. ఈ దాడుల్లో కొంతమంది సభ్యుల్ని కోల్పోయినా రక్తపాతాన్ని మాత్రం ఆపలేదు. 


స్కూళ్లు, హాస్పిటల్స్‌పై దాడులు..


అఫ్గన్ భద్రతా బలగాలు, రాజకీయ నాయకులు, షియా ముస్లింలు, సిక్కులతో పాటు నాటో దళాలనూ లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది ఐసిస్‌-కే. ముఖ్యంగా స్కూళ్లు, హాస్పిటల్స్‌పై దాడులు చేస్తూ వస్తోంది. హాస్పిటల్స్‌లోని మెటర్నరీ వార్డ్‌లోకి దూసుకెళ్లి అత్యంత కిరాతకంగా అక్కడి వాళ్లందరినీ కాల్చి చంపిన ఘటనలు చాలానే ఉన్నాయి. 2017 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 100 దాడులు చేసిందీ సంస్థ. అఫ్గనిస్థాన్, పాకిస్థాన్‌లోని సాధారన ప్రజల్నే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. అటు అమెరికా, అఫ్గాన్, పాకిస్థాన్ భద్రతా బలగాలతోనూ తరచూ తలపడుతోంది. 2018 నాటికి ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన ఉగ్ర సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 100 మిలియన్ డాలర్లకు పైగా నిధుల్ని రాబట్టుకోగలిగింది. గతేడాది ఇరాన్‌లో బాంబు దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 100 మంది చనిపోయారు. అంతకు ముందు 2022 సెప్టెంబర్‌లో కాబూల్‌లోని రష్యా ఎంబసీ వద్ద జరిగిన ఆత్మాహుతి దాడి వెనక ఉన్నదీ ఈ సంస్థే. 2021లో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది అమెరికా సైనికులు మృతి చెందారు. 


రష్యాపై దాడి ఎందుకు..? 


ఈ ఉగ్రసంస్థ పతనం 2021 నుంచి మొదలైంది. అమెరికా బలగాల చేతిలో ఐసిస్‌-కే కి చెందిన కీలక వ్యక్తి హతమయ్యాడు. 2019,2020 నాటికి ఈ సంస్థ కాస్త బలహీనపడింది. సరైన నాయకత్వం లేక ఉగ్రకార్యకలాపాల్ని తగ్గించింది. అటు తాలిబన్లతోనూ సైద్ధాంతిక విభేదాలొచ్చాయి. తాలిబన్ల ఆధిపత్యాన్ని ఐసిస్‌-కే అంగీకరించలేదు. అయితే..అప్పటికే నాయకత్వం లేక నీరుగారిపోయిన ఐసిస్‌-కేని అమెరికా బలగాలు మరింత అణిచివేశాయి. ఫలితంగా దాదాపు 1,400 మంది ఉగ్రవాదులు అఫ్గాన్ ప్రభుత్వానికి లొంగిపోయారు. ఇప్పుడు మళ్లీ తమ ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే రష్యాలోని మాస్కోలో దాడి చేసింది. రష్యానే టార్గెట్‌గా చేసుకోడానికీ కారణముంది. ఎన్నో ఏళ్లుగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర అసహనంతో ఉందీ సంస్థ. ముస్లింలను అణిచివేసేందుకు పుతిన్ సహకరిస్తున్నారని భావిస్తోంది ఐసిస్‌-కే. మధ్యాసియా మిలిటెంట్స్‌ సహకారంతో ముస్లింలను పూర్తిగా అణగదొక్కుతున్నారన్న అసహనంతోనే ఈ దాడి చేసినట్టు సమాచారం. అంతే కాదు. అఫ్గనిస్థాన్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయంగా తమ ఉనికి ఉందని చెప్పుకోడానికి ఈ దాడి చేసినట్టుగా కూడా తెలుస్తోంది.