Desamuduru Re-Release: ప్రస్తుతం టాలీవుడ్లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. స్టార్ హీరోల బర్త్ డే ల సందర్భంగా వారి సినిమాలు మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. ఇప్పటి వరకూ అలా చాలా మంది హీరోల పుట్టిన రోజు సందర్భంగా సినిమాలు రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అభిమానులు కూడా ఎన్నో ఏళ్ల తర్వాత తమ అభిమాన హీరోల సినిమాలు థియేటర్లలో ప్రదర్శించడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. అయితే ఒక్కోసారి వారి అభిమానం శృతి మించడంతో ఊహించని ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. సినిమా విడుదల సందర్భంగా థియేటర్లో బాణాసంచా కాల్చడం, సీట్ కవర్లు చించడం, స్క్రీన్ ను డ్యామేజ్ చేయడం, అక్కడ ఉన్న ఫర్నీచర్ ను ధ్వంసం చేయడం వంటి ఘటనలు గతంలోనూ చూశాం. దీంతో థియేటర్ల యజమానులు రీ రిలీజ్ లు అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా అలాంటి ఘటనలే అల్లు అర్జున్ సినిమా రీ రిలీజ్ సందర్భంగా చోటు చేసుకున్నాయి.
ఏప్రిల్ 8 న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన ‘దేశముదురు’ సినిమాను రీ రిలీజ్ చేశారు దర్శకనిర్మాతలు. ఈ నేపథ్యంలో బన్నీ అభిమానులు అత్యుత్సాహం థియేటర్ల యజమానులను లబోదిబోమనేలా చేసింది. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో బన్నీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. సినిమా రీ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద అభిమానుల తాకిడి ఎక్కువైంది. అయితే థియేటర్ లో షో రన్ అవుతుండగానే లోపల టపాసులు పేల్చారు ఫ్యాన్స్. పేపర్లు చించి రచ్చ రచ్చ చేశారు. దీంతో యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల రాకతో షో ను మధ్యలోనే నిలిపేశారు. దీంతో కొంతమంది అభిమానులు అసహనం వ్యక్తంచేశారు. కొంత మంది అత్యుత్సాహం వలన సినిమాను నిలిపివేయం సరికాదని ఫైర్ అయ్యారట.
ఇక ఈ ఘటనకు సంబంధించి టాలీవుడ్ సినీ నిర్మాత ఎస్కెఎన్ ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ సంధ్య థియేటర్ లో అభిమానుల అత్యుత్సాహం వలన థియేటర్ లోకి పోలీసులు రావాల్సి వచ్చిందని, దీంతో షో మధ్యలోనే నిలిపివేశారని చెప్పుకొచ్చారు. దయచేసి ఎవ్వరూ థియేటర్ సామగ్రిని ధ్వంసం చేయొద్దని, హాయిగా సినిమా చూసి రావాలని పేర్కొన్నారు. అయితే దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. కావాలనే థియేటర్లోకి పోలీసులను తీసుకొచ్చారని మండిపడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. మరికొంత మంది ఇవన్నీ పబ్లిసిటీ స్టంట్ లు అని కొట్టిపడేస్తున్నారు. ఏదేమైనా ఈ రీ రిలీజ్ లు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.
ఇటీవలే రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఆరెంజ్’ సినిమాను విడుదల చేశారు. ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్లను కుమ్మేసింది. ఊహించని విధంగా సినిమాకు కలెక్షన్లు వచ్చేశాయి. దీంతో చరణ్ అభిమానులు పండగ చేసుకున్నారు. అయితే దీనిని బన్నీ అభిమానులు చాలెంజ్ గా తీసుకున్నారు. అందుకే వెంటనే ‘దేశముదురు’ సినిమాను లైన్ లో పెట్టారని టాక్. అయితే ఈ సినిమాకు కూడా బాగానే స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ‘దేశముదురు’ షో రన్ అవుతుండగా థియేటర్ లోకి పోలీసులు రావడం బన్నీ అభిమానులకు నచ్చలేదట. కావాలనే ఇలా చేశారంటూ ఫైర్ అవుతున్నారట. అసలే చరణ్, బన్నీకు మధ్య స్టార్ వార్ నడుస్తుందనే వార్తలు రావడంతో ఇప్పుడు ఈ వ్యవహారం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Also Read : రవితేజ - వరుణ్ ధావన్ - రానా - ఓ బాలీవుడ్ మల్టీస్టారర్!