మూడేళ్ల క్రితం ‘ట్రిపుల్‌ ఎక్స్‌ రిటర్న్‌ ఆఫ్‌ ది జాండర్‌ కేజ్‌’ సినిమాతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన దీపికా పదుకొనే ఇప్పుడు మరోసారి హాలీవుడ్ తెరపై కనిపించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే హాలీవుడ్ తెరపై సత్తాచాటుకుంటోంది ప్రియాంకచోప్రా. దీపిక కూడా ఇప్పుడిదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అందుకే మరో హాలీవుడ్ మూవీలో నటించేందుకు సిద్ధమైంది. రొమాంటిక్ కామెడీగా రూపొందే ఈ సినిమాని ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది. టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. మరో విశేషం ఏంటంటే హీరోయిన్ గా నటిస్తోన్న దీపిక ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామ్యం తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఎస్టీఎక్స్ ఫిలిమ్స్ చైర్మన్ ఆడమ్ ఫోజిల్సన్ మీడియాకు వెల్లడించారు. 'దీపిక ఎంతో ప్రతిభావంతురాలైన ఆర్టిస్టు అనీ, అంతర్జాతీయ స్థాయి సూపర్ స్టార్ గా ఎదుగుతోందనీ ఆయన కొనియాడారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు, ఎస్టీఎక్స్ ఫిలిమ్స్, టెంపుల్ హిల్ ప్రొడక్షన్స్ తో తన చిత్ర నిర్మాణ సంస్థ 'కా ప్రొడక్షన్స్' భాగస్వామ్యాన్ని పంచుకుంటున్నందుకు హ్యాపీగా ఉందని చెప్పింది దీపిక.






దీపిక కొత్త సినిమా ప్రకటనపై స్పందించిన రణవీర్ సింగ్ "వహ్హ్" అని పోస్ట్ చేశాడు. ఇక దీపిక పదుకోన్ కేఏ ప్రొడక్షన్ విషయానికొస్తే 2018లో ఈ సినీ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. యాసిడ్ దాడి బాధితురాలి కథతో ‘ఛపాక్’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతగా తెరకెక్కిస్తున్న రెండో సినిమా హాలీవుడ్ లో కావడం విశేషం.



 ప్రస్తుతం దీపిక షారుఖ్ ఖాన్ తో  ‘పఠాన్’ సినిమాలో నటిస్తోంది. తన భర్త రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘సర్కస్’ సినిమాలో క్యామియో రోల్ పోషించనుంది. వీటితో పాటు ప్రభాస్ హీరోగా నాగశ్విన్ తెరకెక్కించనున్న పాన్ ఇండియా ప్రాజెక్టులోనూ  దీపిక హీరోయిన్.


Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘భిమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది, ఎప్పుడంటే..


Also Read:నిర్మాతగా తాప్సి.. తొలి సినిమా ‘బ్లర్’ షూటింగ్ పూర్తి, నైనిటాల్‌లో సంబరాలు