సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలనుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు డివిజనల్ బెంచ్‌లోనూ సానుకూలమైన తీర్పు రాలేదు. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సింగిల్ బెంచ్ కొట్టి వేయడాన్ని డివిజనల్ బెంచ్ కూడా సమర్థించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో సంగం డెయిరీ ప్రస్తుతం ఉన్న డైరక్టర్లు, రైతులే నిర్వహించుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందు ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లడం ఒక్కటే మార్గం ఉంది. ప్రభుత్వం హైకోర్టు తీర్పును ఆహ్వానించి సంగం డెయిరీని ప్రస్తుతం ఉన్న కార్యవర్గమే నిర్వహించుకునేలా ఆమోదిస్తుందో.. సుప్రీంకోర్టుకు వెళ్తుందో స్పష్టత లేదు. కానీ ఇప్పటికైతే మాత్రం సంగం డెయిరీ విషయంలో ప్రభుత్వం అనుకున్నది చేయలేకపోయింది. హైకోర్టులో ఎదురు దెబ్బలు తిన్నది. 


 ఏప్రిల్ 27న సంగం డెయిరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ జీవో..!


 సంగం డెయిరీకి ఉన్న మిల్క్ ప్రొడ్యూసర్స్ అనుమతిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఏప్రిల్ 27న జీవో జారీ ేసింది. సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసేసింది.  సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీ వ్యవహారాలను చూసే బాధ్యతను  తెనాలి సబ్ కలెక్టర్ కు ఇప్పగించింది.


ప్రభుత్వం చెప్పిన కారణాలు ఇవీ..!


 సంగం డెయిరీ కంపెనీల చట్టం పరిధిలో ఉంది. అయితే ఆ చట్టంలోకి అక్రమంగా మార్చారని  సంతకాలు ఫోర్జరీ చేశారని ప్రభుత్వం ఆరోపించింది. గతంలో ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. అయితే సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అయితే దీనిపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. ఏప్రిల్ 23వ తేదీన చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర, ఎండీలను అరెస్ట్ చేసింది. 27వ తేదీన రోజువారీ వ్యవహారాలకు భంగం కలగకూడదంటూ స్వాధీన ఉత్తర్వులు జారీ చేసి తెనాలి జాయింట్ కలెక్టర్‌ను చార్జ్ తీసుకోవాలని ఆదేశించింది.


స్వాధీన జీవోను కొట్టి వేసిన హైకోర్టు సింగిల్ బెంచ్


ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమని డైరక్టర్లు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు సంగం డెయిరీని స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు గత మే పదిహేడో తేదీన కొట్టి వేసింది. ఆ జీవో చట్ట విరుద్ధమని స్పష్టం చేసింది. డెయిరీ కార్యకలాపాలను డెయిరీ డైరక్టర్లే నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. జీవో  చెల్లదని హైకోర్టు స్పష్టంచేయడంతో మళ్లీ కార్యకలాపాలు ఇప్పటిలాగే డైరక్టర్ల చేతుల మీదుగానే నడుస్తున్నాయి. హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత డైరక్టర్ల బోర్డు విజయవాడలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా సమావేశమయ్యారంటూ పోలీసులు ధూళిపాళ్లపై మరోసారి కేసు పెట్టారు.


నెల రోజుల పాటు జైల్లో ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర..!


ఏప్రిల్ 23న సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ధూళిపాళ్లను తెల్లవారుజామునే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సోదాలని.. కస్టడీ అనే కారణాలు చెప్పి దాదాపుగా నెల రోజుల పాటు ధూళిపాళ్ల నరేంద్రను జైల్లో ఉంచారు. ఆయన జైల్లో ఉన్నప్పుడే స్వాధీన ప్రక్రియ పూర్తి చేయాలనుకున్నారు కానీ న్యాయస్థానాలు జీవోను కొట్టి వేయడంతో ప్రభుత్వానికి వ్రతం చెడినా ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడింది. ఆగస్టు 20వ తేదీన ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్ట్‌కు దేవాదాయ శాఖ నుంచి తాజాగా నోటీసులు ఇచ్చారు. ఈ ట్రస్ట్ సంగం డెయిరీ ప్రాంగంలోనే ఉంటుంది. గం డెయిరీని గతంలో స్వాధీనం చేసుకుంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర‌్వుల సమయంలో ప్రధానంగా ఈ ట్రస్ట్‌పైనే ఆరోపణలు చేశారు.  ట్రస్టు ద్వారా సంగం డెయిరీకి చెందిన పదెకరాల స్థలంలో ధూళిపాళ్ల వీరయ్యచౌదరి ట్రస్టు ఆస్పత్రిని నిర్మించారు. ఆస్పత్రి కట్టిన పది ఎకరాలు సంగం డెయిరీవని అలా ట్రస్ట్‌కు తీసుకోవడం చట్ట విరుద్ధమన్న కారణాన్ని  సంగం డెయిరీ స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రభుత్వం చెప్పింది.


మొత్తంగా సంగం డెయిరీ వివాదానికి హైకోర్టు ముగింపు ఇచ్చినట్లయింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తే వివాదం కొనసాగుతుంది. లేకపోతే ఇక ఎప్పటికీ ప్రభుత్వం ఎప్పటికీ సంగం డెయిరీని స్వాధీనం చేసుకోలేదు. హైకోర్టు ఉత్తర్వులు ఇక ప్రభుత్వాల నుంచి సంగం డెయిరీకి రక్షణ కవచంలా ఉంటుంది.