Mega 156 Title Announcement: ‘వాల్తేరు వీరయ్య’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవికి ‘బోళాశంకర్’ గట్టి దెబ్బకొట్టింది. భారీ అంచనాల నడుమ విడులైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చిరంజీవి తర్వాతి సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్ వశిష్టతో కలిసి ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను సుమారు రూ. 200 కోట్లతో తెరకెక్కించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ షురూ చేశారు మేకర్స్. సోషియో ఫాంటసీ చిత్రంగా ‘మెగా 156’ తెరకెక్కుతుందని చెప్పడంతో ఆడియెన్స్ లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఆస్కార్ విజేతలు ఎంఎం కీరవాణి సంగీతం అదిస్తుండగా, చంద్రబోస్ పాటు రాస్తున్నారు.   


రేపు సాయంత్రం ‘మెగా 156’ టైటిల్ విడుదల


తాజాగా ‘మెగా 156’కు సంబంధించి చిత్ర నిర్మాతలు క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ డేట్ వెల్లడించారు. సంక్రాంతి కానుకగా రేపు (జనవరి 15) సాయంత్రం 5 గంటలకు సినిమా పేరును ప్రకటించనున్నట్లు తెలిపారు. దసరా పండుగ రోజు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా, సంక్రాంతి కానుకగా టైటిల్ రివీల్ కానుంది. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ విడుదల చేసింది. ఈ ప్రకటనతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాకు ఏ పేరు పెడతారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.






‘మెగా 156’ టైటిల్ ‘విశ్వంభర’?


చిరంజీవి పాన్ ఇండియా మూవీ ‘మెగా 156’ టైటిల్ విషయంలో ఇప్పటికే మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు టాక్ వినిపించింది. అంతేకాదు, ఈ టైటిల్ కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. నెటిజన్లు ముందుగానే ఊహించినట్లు ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే పేరు ఉంటుందా? లేదంటే మరే టైటిల్ అయినా ఫిక్స్ చేశారా? అనేది రేపు సాయంత్రం తెలియనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లను కూడా తీసుకుంటున్నట్లు సమాచారం.


చిరంజీవి చివరగా ‘భోళా శంకర్’ సినిమాలో నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. చిరంజీవి చెల్లిగా కీర్తి సురేష్ కనిపించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.


Read Also: రామ్ చరణ్ దంపతులకు అయోధ్య ఆహ్వానం, ఇంటికి వచ్చి ఆహ్వానించిన ఆర్ఎస్ఎస్ సభ్యులు